200 కోట్లకు టోకరా... రియల్ మోసం...లబోదిబోమంటున్న సినీ,టీవీ రంగాల బాధితులు !!
ఇళ్ళు,ఇళ్ళ స్థలాలు, ఫ్లాట్లు ఇప్పిస్తామని వందలాది మంది సినీ పరిశ్రమకు చెందిన వారికి, టెలివిజన్ రంగానికి చెందిన వారికి టోకరా వేసింది ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ మోసానికి పాల్పడింది. నమ్మి పెట్టుబడి పెట్టినందుకు పెట్టుబడిదారులను నిలువునా ముంచింది. మోసం చేసి ఏకంగా బోర్డు తిప్పేసింది. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన 200 కోట్ల రియల్ మోసంతో బాధితులు షాక్ తిన్నారు.
రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో భారీగా మోసం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్లో విజయవాడకు చెందిన రఘు అనే వ్యక్తి అయ్యప్ప సొసైటీ లో నివాసముంటూ స్థానికంగా ఉన్న వారికి నమ్మకంగా వ్యవహరించారు. ఆయన మూడేళ్ల క్రితం శ్రీనగర్ కాలనీలో ప్రారంభించిన స్వధా త్రి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్రితం మాదాపూర్ లో కూడా రెండో ఆఫీస్ ను ప్రారంభించిన ఆయన తన సంస్థలో చాలా మందితో భారీగా పెట్టుబడులు పెట్టించారు.
లాభాల ఆశ చూపించి ఫైనాన్స్ లో , రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు
ఇళ్ల స్థలాలు, ప్లాట్లు అమ్మితే కమీషన్ ఇస్తామని, కమిషన్ బేస్డ్ గా ఏజెంట్లను నియమించుకొని భారీగానే ఇళ్ల స్థలాలు, ప్లాట్లు బుక్ చేయించారు. అంతేకాదు రుణ ధార, స్వచ్ఛ ట్రేడర్స్, స్వధాత్రి ఫైనాన్స్ తదితర పేర్లతో ఫైనాన్స్ వ్యాపారాన్ని సాగించిన ఆయన సదరు కంపెనీ తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే పెట్టుబడిదారులకు బాగా లాభం వచ్చేలా చూస్తామని నమ్మబలికారు. దీంతో అటు ప్లాట్లు ,ఇళ్ల విషయంలోనూ, ఇటు మీరు ఫైనాన్స్ వ్యాపారం లోనూ భారీగా పెట్టుబడులు పెట్టించారు ఏజెంట్లు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..కేసు నమోదు
ఫైనాన్స్ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన వారికి లక్ష రూపాయలకు నెలకు 7,800 రూపాయలు ఇస్తామని చెప్పి మరి పెట్టించారు. కానీ గత నాలుగు నెలలుగా ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో,అదే సమయంలో ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో అనుమానం వచ్చిన పెట్టుబడిదారులు సదరు కంపెనీ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వధా త్రి ఇన్ఫ్రా ఓనర్ రఘు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
పెట్టుబడులు పెట్టాలంటే ఆచితూచి నిర్ణయం అవసరం
ఎక్కువ లాభం ఇస్తామని చెప్పగానే వెనుకా ముందూ చూడకుండా పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మొత్తం వందల సంఖ్యలో ఉన్న పెట్టుబడిదారులకు రెండు వందల కోట్ల రూపాయల మేర టోకరా వేసిన సంస్థ భరతం పట్టాలని, తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించేలా చూడాలని వారు కోరుతున్నారు. అందుకే ఏ సంస్థలో ఎవరు ఎలా పెట్టుబడి పెట్టాలన్నా సంస్థ పుట్టుపూర్వోత్తరాలు ఎంక్వైరీ చేయడమే కాదు,ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం.