200 కోట్ల లొల్లేంది హరీషన్నా.. ఆనాడు 'వైఎస్ఆర్' మీద అరిస్తిరి.. ఈనాడు "కేసీఆర్" అదే దారిలో..!
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. 200 కోట్ల రూపాయల చుట్టూ కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంతూరు చింతమడకకు కేటాయించిన ఆ మొత్తం ఇప్పటి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. చింతమడక, కేసీఆర్ ఓకే.. మధ్యలో ఆయన అల్లుడు హరీష్ రావును కూడా ఎంటర్ చేసింది సోషల్ మీడియా.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఇదే 200 కోట్లకు సంబంధించి ప్రతిపక్ష సభ్యుడిగా హరీష్ రావు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. నిండు సభలో గట్టిగా అరుస్తూ వైఎస్ఆర్ విధానాలను ఎండగట్టారు. అయితే ఆనాటి వీడియో ఈనాడు నెటిజన్లకు దొరికిపోయి సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. చివరకు అది ఎలా అయిందంటే పులివెందుల, చింతమడక, వైఎస్ఆర్, కేసీఆర్, హరీష్ రావు చందంగా కొత్త చర్చకు దారి తీసింది.
సొంతూరి మీద అభిమానం.. 200 కోట్లు మంజూరు
22వ తేదీ సోమవారం నాడు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన సొంతూరు చింతమడకకు వెళ్లారు. చిననాటి స్నేహితులు, బంధువులు, గ్రామ ప్రజలతో ఆత్మీయంగా గడిపారు. ఆ క్రమంలో జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వరాల జల్లు కురిపించారు. తనను ఇంతటివాడిని చేసిన గ్రామాన్ని బంగారు తునకలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దానికోసం 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గుడి, బడి, రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఆ మేరకు నిధులు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల లాభం జరిగేలా కార్యక్రమాలు తీసుకొస్తామని తెలిపారు. ఆ డబ్బులతో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్, హర్వెస్టర్లు, ట్రాక్టర్లు.. అలా ఏదో రూపకంగా అందరూ బాగుపడాలని కోరారు.
కేసీఆర్కు మరో షాక్.. అప్పుడు హైకోర్టు.. ఇప్పుడు గవర్నర్..!
ఆనాడు పులివెందులపై నిలదీశారు.. మరి ఈనాడు చింతమడక..?
జన్మభూమి మీద మమకారమో, పెరిగి పెద్దయిన అనుబంధమో గానీ చింతమడకకు కేసీఆర్ 200 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడిగా టీఆర్ఎస్ నేత హరీష్ రావు నిలదీశారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. లేదంటే కడప జిల్లాకో, రాయలసీమ ప్రాంతానికో ఆంధ్ర ప్రాంతానికో ముఖ్యమంత్రా అంటూ ప్రశ్నించారు.
ఒక పులివెందుల నియోజకవర్గానికే 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకోవడం ప్రాంతీయ తత్వం కాదా అని ఫైరయ్యారు. వైఎస్ఆర్ పెద్ద ప్రాంతీయ వాదని.. అతడికే ప్రాంతీయ తత్వం ఎక్కువని వాదించారు. ఇడుపుల పాయకు, పులివెందులకు, వాళ్ల ఎస్టేట్లు ఉండే ప్రాంతాలకు ఫోర్ లైన్లు రోడ్లు వేసుకున్నారని.. తెలంగాణకేమో అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. ప్రాంతీయవాదిగా మీరు ప్రవర్తిస్తూ తమను ప్రాంతీయవాదులని ఎలా అంటారని హరీష్ రావు గరమయ్యారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా సారూ మీరూ.. నెటిజన్ల ప్రశ్నల వర్షం
ఉమ్మడి రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గం మొత్తానికి కలిపి వైఎస్ఆర్ 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే గగ్గోలు పెట్టిన హరీష్ రావుకు.. ఇప్పుడు కేవలం ఒక చింతమడక గ్రామానికే కేసీఆర్ 200 కోట్లు కేటాయిస్తే కనపడటం లేదా అని నెటిజన్లు పెద్దఎత్తున మండిపడుతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో వివిధ వేదికలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆనాడు అసెంబ్లీలో హరీష్ రావు వైఎస్ఆర్ను నిలదీసిన వీడియోను బాగా సర్క్యులేట్ చేస్తున్నారు.
అదలావుంటే ఒక చింతమడకకు 200 కోట్లు ఇచ్చి ప్రాంతీయ తత్వానికి బీజం వేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ని గ్రామాలను ఒకేలా చూడాల్సిన కేసీఆర్ ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు లేకపోలేదు. ఒకవేళ ఇదంతా పెద్ద రచ్చగా మారితే.. కేసీఆర్ భోళాశంకరుడిలా మారి ఛలో అన్నీ ఊర్లను చింతమడకలా చేస్తామంటే ఎన్ని కోట్లు కావాలి మరి. రాష్ట్రంలో దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయనేది ఒక అంచనా. అలా ఒక్కో పంచాయతీకి 200 కోట్లు ఇచ్చుకుంటూ పోతే 24 లక్షల కోట్లు అవసరమవుతాయి. అధమంగా 50 కోట్లు ఇచ్చినా.. 6 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన తెలంగాణలో ఇది సాధ్యమయ్యే పనేనా అనేది కొందరి ప్రశ్న.
అప్పుల కుప్ప తెలంగాణ.. ఐదేళ్లలో 159 శాతం పెరిగిన వైనం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దరిమిలా 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే అంతవరకు 69 వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ ఈ ఐదేళ్లలో అది దాదాపు మూడింతలకు చేరడం విస్మయం కలిగిస్తోంది. ఇవేవో అంచనాలు మాత్రం కాదు. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించిన గణాంకాలు. ఐదేళ్లలో అప్పులు 159 శాతం పెరగడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చనుందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న అప్పులతో పోలిస్తే ఇప్పుడు దాదాపు మూడింతలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కేటీఆర్ నయా లుక్.. ఫ్యాన్స్ సందడి.. తారకరాముడు హ్యాపీ..!
2018-19లో వడ్డీయే 11 వేల 691 కోట్లు
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ ప్రకారం 2014, జూన్ 2 నాటికి 69 వేల 517 కోట్ల రూపాయల అప్పులు ఉండగా.. 2019 మార్చి చివరినాటికి లక్షా 80 వేల 239 కోట్లకు చేరాయని వెల్లడించారు. 2017-18 నాటికి అప్పుల భారం మరింత పెరిగింది. ప్రభుత్వం చేసిన అప్పులు లక్షా 51 వేల 133 కోట్ల రూపాయలకు చేరగా.. ఆ సంవత్సరం 11 వేల 139 కోట్ల వడ్డీ కట్టింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి అప్పులు తడిసిమోపెడయ్యాయి. లక్షా 80 వేల 239 కోట్ల రూపాయల అప్పుకు గాను 11 వేల 691 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడం గమనార్హం.