తెలంగాణలో కరోనా ఉప్పెన: 2013 మందికి పాజిటివ్, 70 వేల మార్క్ దాటిన మొత్తం కేసులు
తెలంగాణ రాష్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి పాజిటివ్ కేసులు 2 వేల మార్క్ దాటింది. గత 24 గంటల్లో 2 వేల 13 మందికి వైరస్ సోకింది. దీంతో వైరస్ వచ్చిన వారి మొత్తం సంఖ్య 70 వేల మార్క్ దాటింది. మొత్తం 70 వేల 958 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 1139 మందికి వైరస్ తగ్గడంతో ఇంటికి పంపించారు. దీంతో వైరస్ తగ్గిన మొత్తం సంఖ్య 50 వేల 814కి చేరింది.
Recommended Video
కరోనా బారిన వైసీపీ నేతలు: మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్: హైదరాబాద్లో ట్రీట్మెంట్
గత శుక్రవారం కూడా 2083 మందికి కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 19 వేల 568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 13 మంది కరోనా వైరస్తో పోరాడి చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 576కి చేరింది.
గత 24 గంటల్లో 21 వేల 118 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని.. మరో 1167 మంది ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 198, రంగారెడ్డిలో 188, వరంగల్ అర్బన్ 127, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 97 కరోనా కేసులు వచ్చాయి.