వెయ్యి కడితే లక్ష అంటూ ఆశ చూపాడు.. 25కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు
హైదరాబాద్ : బిల్డప్ తో కోట్లు కొల్లగొట్టాడు. 300కు పైగా ఉద్యోగులను నియమించుకుని అతిపెద్ద సంస్థగా సీన్ క్రియెట్ చేశాడు. వెయ్యి పెడితే లక్ష వస్తుందని నమ్మించాడు. అంతేకాదు ఆధ్యాత్మిక ముసుగులో పలువుర్ని నమ్మించి లక్షలకు లక్షలు నొక్కేశాడు. సూటు, బూటులో దొరబాబులా కనిపించేసరికి అందరూ ఫాలో అయ్యారు. చివరకు నట్టేట ముంచాడని తెలియడంతో బోరుమంటున్నారు. దేశంలోనే అపర కుబేరునిగా మారబోతున్నానంటూ, తనతో కలిస్తే మీకు మంచి లాభాలుంటాయని అందినకాడికి దండుకున్నాడు. అలా ఏకంగా 25 కోట్ల రూపాయలు పోగేసి, ఖరీదైన కార్లు, విదేశీ టూర్లతో జల్సా చేశాడు. చివరకు పోలీసుల కంటికి చిక్కి కటాకటాలపాలయ్యాడు.
ఆధ్యాత్మిక ముసుగులో కుచ్చుటోపి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన 34 ఏళ్ల గిరీష్ సింగ్ ఇంటర్ వరకు చదివాడు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో తన సోదరుడు దిలీప్ సింగ్ తో కలిసి ఉండేవాడు. పనిచేయడం ఇష్టంలేక మోసాలబాట పట్టాడు. ఆధ్యాత్మిక ప్రసంగాలు విని విని చివరకు తానే ప్రవచనాలు చెప్పే స్థాయికి చేరాడు. ఇక్కడినుంచే తన మోసాల పరంపరకు శ్రీకారం చుట్టాడు. భక్తుల సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ ఏవో ప్రక్రియలు చెబుతుండేవాడు. కోట్లు కూడబెట్టాలంటే కుబేర ప్రక్రియ.. పెళ్లి కోసం కల్యాణ ప్రక్రియ అంటూ తన వద్దకు వచ్చేవారిని బోల్తా కొట్టించేవాడు. ఇదంతా కూడా పక్కా ప్లాన్ గా చేసిన గిరీష్ సింగ్.. పెద్ద హోటళ్లల్లో మీటింగులు పెట్టేవాడు. అంతేకాదు టీవి ఛానళ్లల్లో అడ్డగోలు పెయిడ్ కార్యక్రమాలతో ముగ్గులోకి దించేవాడు.
కాంప్రమైజ్
చాలా
కాస్ట్లీ
గురూ..!
రె'బెల్స్"
బేరసారాలతో
అభ్యర్థులు
బేజార్
కార్పొరేట్ బిల్డప్.. విలాసవంతమైన జీవితం
ఆర్థిక నేరాల్లో ఆరితేరిన గిరీష్ సింగ్.. ఒక్కొక్కరి దగ్గరి నుంచి దాదాపు 2 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2017లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఓ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కార్యాలయం తెరిచాడు. మాదాపూర్ లో నెలకు 23 లక్షల రూపాయలతో నాలుగంతస్తుల భవనం అద్దెకు తీసుకున్నాడంటే..
గిరీష్ మైండ్ సెట్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. అంతేకాదు దాదాపు 300కు పైగా ఉద్యోగులను నియమించి కార్పొరేట్ బిల్డప్ ఇచ్చాడు. 30 సంస్థలు ఎస్టాబ్లిష్ చేస్తున్నామని.. అందులో వెయ్యి పెట్టుబడి పెడితే త్వరలోనే లక్ష రూపాయలు మీ సొంతం అంటూ ఊరించాడు. దీంతో సామాన్యుల నుంచి కోటిశ్వరుల దాకా అతగాడి మాటలు నమ్మి పోలోమంటూ ఫాలోయ్యారు. ఇలా అందరి దగ్గర్నుంచి దాదాపు 25 కోట్ల రూపాయలు కూడబెట్టి.. ఫారిన్ టూర్స్, విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లతో జల్సా చేశాడు. అంతేకాదు కోట్ల రూపాయలు అడ్డగోలుగా ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోవడం గమనార్హం.
అందినకాడికి దోచాడు.. చివరకు చిక్కాడు
వెయ్యి కట్టి లక్షకు ఆశపడ్డోళ్లు కొంతకాలం ఆగి గిరీష్ ను డబ్బులు అడగటం మొదలుపెట్టారు. దీంతో షోప్ టాప్ తప్ప వ్యాపారాలు చేయని గిరీష్ మెల్లిగా ముఖం చాటేస్తూ వచ్చాడు. అంతటి ముదురును కొందరు గట్టిగా నిలదీస్తే.. బౌన్సర్లతో బెదిరించేవాడు. చివరకు ఓ బాధితుడు తెగించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో గిరీష్ మోసాల చిట్టా వెలుగుచూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దాదాపు నెలరోజులు దర్యాప్తు చేసి గిరీశ్ బండారం బయటపెట్టారు.
సోమవారం గిరీష్ సింగ్ తో పాటు అతనికి సహకరించిన సోదరుడు దిలీప్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 2 షెవర్లే క్రూయిజ్ కార్లు, ఒక జాగ్వార్, ఒక వెర్నా కారుతో పాటు మూడు బైకులు.. పాస్పోర్టులు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే విషయం తెలిసిన బాధితులు సీపీ క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. నమ్మించి నట్టేట ముంచిన గిరీష్ సింగ్ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని కోరారు.