25 మంది ప్రమేయం: పోలీసుల ముందే హేమంత్పై అవంతి పేరంట్స్ దురుసు ప్రవర్తన
హేమంత్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నఅవంతి దంపతులకు ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. మీరెలా బతుకుతారో చూస్తాం అంటూ పోలీసుల ముందే హెచ్చరించారు. అయితే అవంతి జంటకు భద్రత కల్పించాలని, వారి పేరంట్స్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని సీపీ చెప్పినా.. కొందరు పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసుల నిర్లక్ష్యం..?
అవంతి దంపతుల ఇష్యూలో చందానగర్ పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. రక్షణ ఇవ్వాలని వారు సీపీ సజ్జనార్ని కలిశాక.. చందానగర్ పోలీసులకు ఫోన్చేసి భద్రత కల్పించాలని ఆదేశించారు. దీంతోపాటు అవంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
వారి ముందే బెదిరింపులు..
పెళ్లయిన వారం రోజులకు అవంతి, హేమంత్ను కౌన్సెలింగ్ కోసం పోలీసుల పిలిచారు. అయితే అక్కడ అవంతి పేరంట్స్కే పోలీసులు సపోర్ట్ చేయడం విశేషం. పోలీసుల ముందే హేమంత్, అతని పేరంట్స్ను లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్రెడ్డి తిట్టారు. కానీ పోలీసులు మాత్రం ఆపలేదు కదా.. మద్దతిచ్చేలా వ్యవహరించారు. ఎలా జీవిస్తారో చూస్తామని బెదిరించగా.. తమకు ప్రాణహాని ఉందని హేమంత్ ఫ్యామిలీ అదే రోజు ఫిర్యాదు చేసినా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
సీపీని కలిసిన తర్వాత..
అప్పుడే స్పందించి ఉండే ఇంతవరకు వచ్చేది కాదు అని హేమంత్ పేరంట్స్ అంటున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, మంగళవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ని కలిసి ఫిర్యాదు చేస్తామని అవంతి తెలిపారు. సీపీని కలిశాక తదుపరి కార్యాచరణను తెలియజేస్తామని హేమంత్ సోదరుడు సుమంత్ వెల్లడించారు.
మొత్తం 25 మంది..
హేమంత్ను కిడ్నాప్ చేసిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న సీసీకెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పటాన్చెరు నుంచి సంగారెడ్డి, జహీరాబాద్ వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. హేమంత్ హత్య కేసులో 18 మంది పాల్గొన్నారని భావించారు. కానీ అవంతి అన్నయ్య ఆశిష్రెడ్డి, బంధువు సందీప్రెడ్డి, మరో ఐదుగురు వ్యక్తుల పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితులు లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్రెడ్డితోపాటు.. సుపారి హంతకుడు బిచ్చూయాదవ్ను మంగళవారం పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.