కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు... మరో ఇద్దరు మృతి
తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 472 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Recommended Video
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1581కి చేరింది. ప్రస్తుతం 4005 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2283 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,86,542కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 31,486 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,15,066కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 2,01,909 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.6 శాతం ఉండగా తెలంగాణలో 98.08శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 51 కేసులు మోదయ్యాయి.
కాగా,మంగళవారం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కరోనా టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 1,034 ప్రభుత్వ కేంద్రాల్లో టీకాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది.ఒక్కో కేంద్రంలో వందమందికి చొప్పున టీకా ఇవ్వనున్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది మొత్తంగా 3.30 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 3.84 లక్షల టీకాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే.ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రానికి మరో 3.5 లక్షల కరోనా టీకాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు.సోమవారం రాష్ట్రంలోని 335 కేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపట్టగా... మొత్తం 13,666 మందికి టీకాలు వేసినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.