ఇంటర్ బోర్డు తప్పిదాలపై త్రిసభ్య కమిటీ.. అసలు కారణం ఇదేనంటున్న మంత్రి..!
హైదరాబాద్ : ఇంటర్మీడియట్.. విద్యార్థుల జీవితాలకు టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందడానికి రాత్రింబవళ్లు విద్యార్థులు పుస్తకాలతో ఎంతలా కుస్తీ పడతారో అందరికీ తెలుసు. పరీక్షలు రాసింది మొదలు ఫలితాలు వచ్చేంతవరకు అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. అలాంటిది బాగా పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా సున్నా మార్కులు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా తప్పుల తడకలా మారిన ఇంటర్ ఫలితాల తీరు బోర్డుకు మాయని మచ్చలా మిగిలింది.
అయితే ఇంటర్ ఫలితాల గందరగోళంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఆ మేరకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి .
తప్పుల తడక.. గందరగోళం
తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఈసారి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఫలితాల ప్రకటన మొదలు విడుదల దాకా అన్నీ అనుమానాలే. స్పాట్ వాల్యూయేషన్ సరిగా జరగలేదంటూ మొదటినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఫలితాలు విడుదలయ్యాక తప్పుల తడక గందరగోళం చూస్తుంటే ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ఇంటర్ ఫలితాల విడుదలలో లెక్కలేనన్ని తప్పులు వెలుగుచూస్తుంటే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇంటర్ ఫలితాలపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ఆదివారం నాడు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. మూడు రోజుల్లో తగిన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
బీసీలకు అన్యాయం.. కేసీఆర్ను క్షమించరు.. అఖిలపక్షం భేటీలో ధ్వజమెత్తిన నేతలు
త్రిసభ్య కమిటీ.. 3 రోజుల్లో నివేదిక..!
ఇంటర్ ఫలితాల గందరగోళంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన పడొద్దని కోరారు. కొంతమంది అధికారుల మధ్య అంతర్గత తగదాలే ఈ అపోహలకు కారణమనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు మంత్రి.
ఇంటర్ ఫలితాల తీరుపై నిజాలు నిగ్గు తేల్చేందుకు వేసిన త్రిసభ్య కమిటీలో హైదరాబాద్ బిట్స్ పిలానికి చెందిన ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్ లను సభ్యులుగా నియమించినట్లు మంత్రి తెలిపారు.
ఎవరూ నష్టపోవద్దు : మంత్రి
ఇంటర్ ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగాయని ఎవరైనా భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మంత్రి. ఒకవేళ పొరపాట్లు జరిగినట్లు తేలితే అధికారులు సరిదిద్దుతారని హామీ ఇచ్చారు. మార్కుల విషయంలో ఎవరూ నష్టపోకుండా చూస్తామని స్పష్టం చేశారు.