30 నెలలుగా చిత్రహింసలు.. సౌదీలో హైదరాబాద్ మహిళకు చేదు అనుభవం..!
హైదరాబాద్ : జీవితంపై ఎన్నో ఆశలతో పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ ప్రాంతాలకు వెళుతున్న తెలుగు ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు ఏజెంట్ల మోసాలు.. మరోవైపు అక్కడి యజమానుల తీరు తెలుగు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ సౌదీకి వెళ్లి నరకయాతన అనుభవించిన ఘటన వెలుగు చూసింది.
కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా నిలుద్దామని రియాద్కు చేరుకున్న హలీమున్నిసాను 30 నెలలుగా చిత్రహింసలకు గురి చేశాడు అక్కడి యజమాని. ఫలక్నుమా వట్టేపల్లి ప్రాంతానికి చెందిన బాధితురాలు నగరంలో బ్యుటీషియన్గా పనిచేసేవారు. ఆ క్రమంలో వికార్, అహ్మద్ అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు పరిచయమయ్యారు. సౌదీకి వెళితే ఎక్కువ జీతం వస్తుందంటూ నమ్మించి ఆమెను రియాద్ పంపించారు. అయితే వర్క్ వీసా పేరుతో హలీమున్నిసా నుంచి భారీగా డబ్బులు గుంజి కేవలం 90 రోజుల పాటు చెల్లుబాటయ్యే విజిట్ వీసా చేతిలో పెట్టారు. అది తెలియక రియాద్ వెళ్లిన ఆమెకు ప్రతి నిత్యం నరకంగా మారింది.
వ్యభిచారం రూట్ మారింది.. కోరుకున్న అమ్మాయిలు ఈజీగా.. మందుబాబులేమీ తక్కువ కాదుగా..!
బ్యుటీషియన్గా రియాద్కు వెళుతున్నానని సంబరపడ్డ ఆమె ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 2017 మార్చి 19వ తేదీన విమానమెక్కి రియాద్ వెళ్లిపోయారు. అయితే ఇక్కడి ఏజెంట్లు అక్కడి షేక్తో రెండున్నర లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను పనిమనిషిగా పంపించారు. విషయం తెలియని హలీమున్నిసా అక్కడకు వెళ్లాక నానా ఇబ్బందులు పడ్డారు.
రియాద్ వెళ్లి ఏజెంట్లు చెప్పిన ప్రకారం షేక్ దగ్గరకు వెళ్లినప్పటి నుంచి ఆమెకు నిత్యం నరకమే. 20 మంది కుటుంబ సభ్యులున్న సదరు షేక్ ఇంట్లో రోజుకు 15 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చేది. ఆరోగ్యం బాగా లేదని చెబితే కరెంట్ షాకులు ఇచ్చేవారట. కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడటానికి వీలు లేకుండా చేశాడు షేక్. చివరకు ఎలాగోలా తన ఫ్యామిలీ మెంబర్స్కు ఫోన్ చేసిన హలీమున్నిసా తన బాధనంతా వివరించారు. అయితే ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ సాయం కోరగా ఆయన స్పందించారు. ఆ క్రమంలో షేక్ చెర నుంచి బయటపడ్డ హలీమున్నిసా గత నెల 15వ తేదీన నగరానికి చేరుకున్నారు. తనను మోసం చేసిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హలీమున్నిసా.