350 ఆస్పత్రులకు నోటీసులు, షైన్ ఆస్పత్రి ఘటనతో దిద్దుబాటు చర్యలు
రెండురోజుల క్రితం షైన్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని దవాఖానలపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు 350 హాస్పిటల్స్ గుర్తించింది. ఈ మేరకు నోటీసులు జారీచేసినట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి.
షైన్ ఘటనతో..
ఎల్బీనగర్ సమీపంలోని షైన్ ఆస్పత్రి ఐసీయూలో రెండురోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఓ చిన్నారి మృతిచెందిన సంగతి తెలిసిందే. మరో నలుగురు గాయపడి,, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తర్వాత మహానగరంలో ఆస్పత్రుల గురించి తనిఖీలు చేపట్టారు. సరైన భద్రతా ప్రమాణాలు లేని దవాఖానాలు భారీగా ఉన్నట్టు తెలిసింది. 350 ఆస్పత్రులను గుర్తించి నోటీసులు జారీచేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
1500 దవాఖానాలు
హైదరాబాద్లో మొత్తం 1500 దవాఖానాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్ విజిలెన్స్ మరియు డిజాస్టర్ మేనేజెమెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దవాఖానాల్లో తనిఖీలు చేపట్టి నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా భద్రతా ప్రమాణాల్లో డొల్లతనం బట్టబయలైందని పేర్కొన్నారు.
ఇదీ విషయం..
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆస్పత్రుల తీరుపై తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు నోటీసులు జారీచేశారు. భద్రతా నియమాలు పాటించిన 350 ఆస్పత్రులకు తాళం వేసినట్టు పేర్కొన్నారు. చాలా వాటిల్లో భవన నిర్మాణ అనుమతి రాలేదనే కఠోర నిజం బయటపడింది.
ఏం జరిగిందంటే..
ఈ నెల 21న తెల్లవారుజామున షైన్ ఆస్పత్రి ఐసీయూలో అగ్రిప్రమాదం జరిగింది. దీంతో నాలుగు నెలల చిన్నారి చనిపోయాడు. మరో నలుగురు గాయాలవడంతో కలకలం రేపింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడంతో ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలకు ఉపక్రమించారు. కొన్ని ఆస్పత్రుల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఎక్స్ రే మిషన్లు, రిసెప్షన్ కౌంటర్లు సెల్లార్ పెడతారని గుర్తుచేశారు. సరైన భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు. 350 ఆస్పత్రులకు జారీచేసిన నోటీసులపై వివరణ ఇవ్వాలని సూచించారు. భద్రతా నియమాలు ఏమేం తీసుకున్నామనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు.