హైదరాబాద్లో అలజడి.. ఖైరతాబాద్లో దారుణ హత్య..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో అలజడి రేగుతోంది. వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కత్తులతో వీరంగం వేస్తూ నడిరోడ్డుపై రెచ్చిపోతున్న దుండగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే క్రమంలో వెలుగుచూసిన మరో హత్య సంచలనం సృష్టించింది. ఖైరతాబాద్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశమైంది.
నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం జినుగుపల్లి గ్రామానికి చెందిన 56 ఏళ్ల బంగారయ్య కొన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్ ఏరియాలోని బీజేఆర్ నగర్లో నివసిస్తున్నారు. అయితే శనివారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా చంపేయడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలం పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంగారయ్య ఆయన భార్యకు తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్న మాట. అయితే అదే క్రమంలో శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య తగవులాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె తమ ఇంటి సమీపంలో నివసించే బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే అర్ధరాత్రి పూట బంగారయ్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఆయన హత్యకు గురికావడం చర్చానీయాంశమైంది.
370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!
అదలావుంటే ఖైరతాబాద్ రైలు గేటు సమీపంలోని 75వ నెంబర్ మెట్రో పిల్లర్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్నాడు బంగారయ్య. అయితే ఆదివారం నాడు ఉదయం విధుల్లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి బంగారయ్య మృతదేహం కనిపించింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే బంగారయ్య డెడ్ బాడీ పక్కనే పడి ఉన్న సిమెంట్ రాయికి రక్తపు మరకలు కనిపించడంతో.. ఆ కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రాయితో బంగారయ్య తలపై మోది హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి హత్యకు దారితీసిన కారణాలు అన్వేషిస్తామంటున్నారు పోలీసులు.