త్వరలో 57 ఏళ్ల వృద్ధులకు పెన్షన్ అమలు, ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ మిన్న : కేసీఆర్
హైదరాబాద్ : సంక్షేమ పథకాలు యధాతథంగా కొనాసాగుతాయన్నారు సీఎం కేసీఆర్. ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి పథకాలకు నిధుల కేటాయింపు కంటిన్యూ అవుతుందని వివరించారు. ఆర్థిక మాంద్యం ఉన్న సంక్షేమ పథకాలు మాత్రానికి మాత్రం బ్రేక్ ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం .. కేంద్రానికి గత ఐదేళ్ళలో చెల్లించిన పన్ను ఎంతంటే !!
ఆసరాగా ఉంటాం..
ఆసరా పెన్షన్లను దాదాపు డబుల్ చేశామని వివరించారు సీఎం కేసీఆర్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల 16కు పెంచిన సంగతి తెలిసిందే. వికలాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500 నుంచి రూ.3016కు పెంచినట్టు గుర్తుచేశారు. ఆసరా పెన్షన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు.
57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ అమలు
వృద్దాప్య పెన్షన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినట్టు పేర్కొన్నారు. త్వరలో 57 ఏళ్లు నిండినవారికి వృద్దాప్య పెన్షన్ అందజేస్తామని పేర్కొన్నారు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని కూడా ప్రభుత్వం తొలగించిందన్నారు. ఆసరా పెన్షన్ల కోసం పద్దులో 9 వేల 402 కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పథకాలు మిన్న అన్నారు సీఎం కేసీఆర్.
ఆరోగ్య శ్రీ మిన్న
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ పథకం విశిష్టమైనదని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ.1336 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250 కోట్ల విలువైన వైద్యసేవలు మాత్రమే అందుతాయని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే .. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు కలిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందబోమని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా .. ఆరోగ్య శ్రీ పథకం మెరుగైనదని .. అందుకోసమే కేంద్ర పథకాన్ని వద్దనుకున్నామని వివరించారు.