రూ.70 కోట్ల ఆస్తులు: మల్కాజిగిరి ఏసీపీ అక్రమార్జన..? ఏసీబీ అధికారులు
భూ వివాదాలు, సెటిల్ మెంట్లు చేశారనే ఆరోపణలపై మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 25 కోట్ల తనిఖీలు చేపట్టగా.. రూ.70 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని.. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
ఏకకాలంలో సోదాలు
బుధవారం ఉదయం నరసింహారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపురంలో తనిఖీలు చేశారు. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, కమర్షియల్ బిల్డింగ్స్ గురించి ఆరాతీశారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో నరసింహారెడ్డి ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
4 ప్లాట్లు, రెండు ఇళ్లు
హైదరాబాద్లో గల సైబర్ టవర్స్ ముందు 4 ప్లాట్లు, హఫీజ్ పెట్ లో జీ ప్లస్ 3 కమర్షియల్ కాంప్లెక్స్, మరో రెండు ఇంటి ప్లాట్స్, నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సోదాలు చేయగా 15 లక్షల నగదు పట్టుబడింది. రెండు బ్యాంక్ లాకర్లతోపాటు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు గుర్తించారు.
55 ఎకరాల భూమి
అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్. అనంతపురంలో మొత్తం 25 చోట్ల సోదాలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. నరసింహా రెడ్డి గతంలో ఉప్పల్ సీఐగా పని చేశారు. పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసి అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఏసీపీ నరసింహారెడ్డి మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు.
ఇదివరకు కూకట్ పల్లి ఏసీపీ
గతంలో కూకట్పల్లి ఏసీపీ సంజీవరావును కూడా అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్హెచ్ఓల పరిధిలోని పలు కేసుల్లో సంజీవరావు తలదూర్చి అక్రమార్జనకు తెరలేపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోనూ డబ్బులు డిమాండ్ చేసి రాజీ కుదిర్చినట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బినామీ ఆస్తులను గుర్తించారు.