80 స్పెషల్ ఆఫీసర్ల నియామకం.. 1920 ట్రాన్స్ఫార్మర్ రిపేర్.. సహాయక చర్యలపై కేటీఆర్
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. మరో రెండు, మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో హైదరాబాదీల గుండె గుబేల్ మంటోంది. పలు కాలనీలు ఇప్పటికీ జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరదనీరు, పారిశుద్ద్యంపై బల్దియా ఫోకస్ చేసింది. వరద నివారణ చర్యలను పటిష్టంగా చేపడుతోంది.
హైదరాబాద్ కు వానగండం .. కష్టంగా మారిన సహాయక చర్యలు ..కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహం
రెండో అతిపెద్ద వర్షం
హైదరాబాద్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీకి 1908లో వరదలు వచ్చాయని గుర్తుచేశారు. ఆ సమయంలో ఒకే రోజు 43 సెంటీమీటర్లు వర్షం కురిసిందన్నారు. హైదరాబాద్లో యావరేజ్గా ఏటా 78 సెం.మీ. వర్షం పడుతుందని.. కానీ ఈ సారి ఇప్పటికే 80 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.
జనం ఇబ్బందులు
భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వేలాది మంది వరద బాధితులని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పారు. సహాయ చర్యల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.45 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టామని, 1920 ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 80 మంది స్పెషల్ ఆఫీసర్లను ప్రత్యేకంగా నియమించామని, శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని తేల్చిచెప్పారు.
Recommended Video
జలమయం..
పలు కాలనీలు, చెరువు దిగువ గల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరూర్నగర్లో పదుల సంఖ్యలో కాలనీల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఇళ్లలో నుంచి ఎవరూ కూడా బయటకు రానీ పరిస్థితి ఏర్పడింది. కొందరు ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, సరూర్నగర్ చెరువు పూర్తిగా నిండిపోవడంతో దిగువ ప్రాంతలకు నీరు ప్రవహిస్తోంది.