85 వేల ఇళ్లు: డిసెంబర్లో గ్రేటర్ పేదలకు పంపిణీ: మంత్రి కేటీఆర్
గ్రేటర్ పరిధిలో గల పేదలకు గుడ్ న్యూస్. దాదాపు 85 వేల నిరుపేదలకు ఇళ్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి కావొచ్చని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అర్హులకు డిసెంబర్లో ఇళ్లను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ బుద్ధభవన్ ఈవీడీఎం కార్యాలయంలో సమీక్షించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెండురోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో గల పేదలకు లక్ష డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ. 9,700 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్లో పంపిణీ చేసే 85 వేల ఇళ్లలో.. 75 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కాగా, పదివేలు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
Recommended Video
ఆయా ఇళ్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పేదలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల ఇళ్ల చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు.