హైదరాబాద్లో డాక్టర్ కిడ్నాప్ కలకలం: బురఖాలో వచ్చి అతని కారులోనే అపహరణ
హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలో ఓ వైద్యుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. హిమాయత్సాగర్ దర్గా సమీపంలో ఉన్న డెంటిస్ట్ డాక్టర్ బెహజాట్ హుస్సేన్ను బురఖాలో వచ్చిన దుండగులు అతడి కారులోనే కిడ్నాప్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన వైద్యుడి కుటుంబసభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డాక్టర్ కారు నెంబర్ ఏపీ 9వై 0031గా కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా? వ్యాపార లావాదేవీల కారణంగా వైద్యుడిని అపహరించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కారు వెళ్లిన దారిలో సీసీటీవీ ఫుటేజ్ను సేకరించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేంద్రనగర్ డాక్టర్ కిడ్నాప్ కేసు విషయంలో సైబరాబాద్ సీపీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం మొదటగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ సెల్ఫోన్ కాల్ రికార్డింగ్ పరిశీలిస్తున్నారు.
నాచారంలో నేపాల్ దోపిడీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పని మనుషులుగా చేరి వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి డబ్బు, బంగారంతో పరారైనట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మొత్తం రూ. 10 లక్షల నగదు, 19 తులాల బంగారం ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ ముఠాలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.