అరణ్యాన్ని వదిలి.. జనారణ్యంలోకి చిరుత: మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్లి నాలుగు గంటలుగా: కథ సుఖాంతమే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ చిరుత హల్చల్ సృష్టించింది. జనావాసాల్లోకి దూరింది. ఓ ఇంటి డాబాపై తిష్ట వేసింది. సుమారు నాలుగైదు గంటల పాటు అక్కడే కూర్చుంది. తెల్లవారు జామున గానీ దాన్ని గుర్తించలేకపోయారు ఆ ఇంటి యజమాని. తీరా దాన్ని చూసిన తరువాత పైప్రాణాలు పైనే పోయాయి. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాన్ని బంధించి, హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కునకు తరలించారు.
షాద్నగర్ పటేల్ రోడ్డులో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ రోడ్డులో నివసిస్తోన్న మన్నె విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై మకాం వేసిందా చిరుత. అర్ధరాత్రి ఎప్పుడొచ్చిందో తెలియదు గానీ.. ఉదయం 8 గంటల సమయంలో చిరుత ఉన్న విషయాన్ని విజయ్ కుమార్ గుర్తించారు. డాబా మీద పెంచుతున్న మొక్కలకు నీళ్లు పోయడానికి ఆయన వెళ్లగా.. చిరుత కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, అటవీశాఖ సిబ్బంది విజయ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. షాద్నగర్ ఏసీపీ సురేందర్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు ట్రాన్క్విలైజర్ ఇచ్చారు. అనంతరం దాన్ని బంధించి, హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్కు తరలించారు. అడవుల్లో సంచరిన వణ్యప్రాణి.. తమ ఇళ్ల మధ్యకు చేరుకుందనే విషయం తెలిసిన వెంటనే స్థానికులు పోలోమంటూ పటేల్ రోడ్డుకు పరుగులు తీశారు. ఇళ్ల డాబాల పైకి ఎక్కి.. చిరుతను బంధించడాన్ని తమ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు.