టీం లీడర్ పరువు తీయాలనుకొని.. భార్యనే ‘కాల్గర్ల్’ చేశాడీ ప్రబుద్ధుడు!
హైదరాబాద్: ఒకరికి చేటు చేయాలనుకుంటే మనకే చేటు జరుగుతోందన్న సామెత ఈ వార్తను చూస్తే 100శాతం నిజమేననిపిస్తోంది. ఉద్యోగం చేస్తున్న తన భార్యకు.. అధిక టార్గెట్లు ఇస్తుందనే కోపంతో.. టీం లీడర్ పరువు తీయాలనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నం కాస్త బెడిసికొట్టడంతో తన భార్య ప్రతిష్టను బజారుకీడ్చిన వాడయ్యాడు.
పేరున్న కంపెనీలో భార్య ఉద్యోగం..
రాచకొండ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన జాన్ జార్జి ఈసీఐఎల్ రాధిక మల్టీప్లెక్స్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కాగా, అతని భార్య ఓ పేరొందిన ఎలక్ట్రిక్ సామగ్రి విక్రయ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
టీం లీడర్ పరువు తీయాలని..
అయితే, ఆ సామగ్రి విక్రయాలకు సంబంధించి టీం లీడర్ తరచూ ఆమెకు టార్గెట్స్ విధిస్తోంది.. దీంతో అతని భార్య విధుల నిర్వహణలో అధిక సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగం వద్దన్నా.. ఆమె వెళ్తోంది. ఈ నేపథ్యంలో కోపం పెంచుకున్న జాన్.. టీం లీడర్ పరువు తీయాలని భావించాడు.
కాల్ గర్ల్స్ అంటూ..
షేర్ చాట్లో ఆ టీం లీడర్ ఉన్న గ్రూపు ఫొటో పెట్టి కాల్ గర్ల్స్ అంటూ టీం లీడర్ ఫోన్ నంబర్ అందులో పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో అతని భార్య కూడా ఉండడం గమనార్హం. ఇది చూసిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భార్యనూ కూడా కాల్ గర్ల్గా..
దర్యాప్తు చేసిన అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా జాన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ అసభ్యకరమైన పోస్టింగ్ పెట్టింది తానేనని అంగీకరించాడు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. టీం లీడర్ పరువు తీయాలనుకుని తన భార్య ఫొటో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు ఈ దుర్మార్గుడు. దీంతో కట్టుకున్న భార్య ప్రతిష్టను కూడా బజారుకీడ్చాడు ఈ ప్రబుద్ధుడు.