గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసి.. తనువు చాలించిన శ్రావణి: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తామామలతోపాటు భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. రెండ్రోజుల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసి బాధ్యత చాటుకున్న ఆమె.. ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదాన్ని నింపింది.
పెళ్లైన కొంత కాలానికే శ్రావణికి వేధింపులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన భీంశెట్టి సత్యనారాయణ ఈసీఐఎల్ విశ్రాంత ఉద్యోగి. ఆయన తన భార్య, కుమార్త శ్రావణి(25), కుమారుడు కళ్యాణ్తో కేపీహెచ్బీ నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరూ బీటెక్ పూర్తి చేశారు. శ్రావణి ఈసీఐఎల్లో కొంతకాలం ఉద్యోగం చేసింది. కాగా, 2019, నవంబర్ 10న మిర్యాలగూడకు చెందిన వీరబొమ్ము శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రదీప్తో శ్రావణికి వివాహమైంది. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వివాహమైన కొంత కాలానికే శ్రావణికి భర్త ప్రదీప్, అత్తామాలు హైమావతి, శ్రీనివాస్ల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
మాటలతోనే హింసించారు..
కుంటిగా నడుస్తున్నావని, నీ మనసులో మరో వ్యక్తి ఉన్నారంటూ శ్రావణిని ప్రదీప్ మాటలతో హింసించేవాడు. ఫిబ్రవరి 10న ప్రదీప్ అమెరికా వెళ్లాడు. అక్కడ్నుంచి కూడా వీడియో కాల్ చేసి వేధించేవాడు. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ సమయం ఈ జులైలో నెలలో శ్రావణి పుట్టింటికి వెళ్లింది. ఇక ఆమె అత్త హైమావతి కూడా నవంబరులో అమెరికాలోని కుమారుల వద్దకు వెళ్లింది.
Recommended Video
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసి.. తనువు చాలించింది..
కాగా, మంగళవారం జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా శ్రావణి ఉదయమే ఓటేసి ఇంటికొచ్చి బెడ్రూంలోకి వెళ్లింది. నిద్రిస్తుందేమోనని భావించారు కుటుంబసభ్యులు. టిఫిన్ కోసం తల్లి తలుపు తట్టగా స్పందనరాలేదు. ఇరుగుపొరుగుతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది శ్రావణి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతరు కళ్లముందే మరణించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రావణి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మామ శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.