లాక్డౌన్ ఉందని ఆపితే.. కానిస్టేబుల్పై తల్లీకొడుకు దాడి, అసభ్యపదజాలంతో దూషణ
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులకే ఎదురుతిరిగి, వారిపై దాడి చేస్తున్నారు కూడా. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
మల్కాజ్ గిరి పరిధి మౌలాలీలోని ప్రశాంతినగర్ చెక్ పోస్టు వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై యువకుడితోపాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్ వారిని ఆపి లాక్ డౌన్ అమల్లో ఉందని, బైక్పై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితోపాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై సదరు కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దాడి చేశారు.
అయితే, ఒక్కడేవున్న మరికొంత మంది పోలీసు ఉన్నతాధికారులు నచ్చచెప్పినా ఆ మహిళ వినిపించుకోలేదు. అంతేగాక, పోలీసులను అనుచిత పదజాలంతో దూషించారు. దీంతో ఆ యువకుడిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Plz watch the video carefully pic.twitter.com/qJwvgdABd4
— Malkajgiri Police Station (@Malkajgirips) April 3, 2020
భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరిన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది.
తాజాగా, 75 కేసులు పెరగడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనాసోకి కోలుకున్న వారిలో 15 మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
కాగా, కరోనాతో శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. సికింద్రాబాద్, షాద్ నగర్కు చెందిన వ్యక్తులు మృతి చెందగా.. మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఇక, ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించామని, యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.