మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎక్కడలేని స్వేచ్చ వచ్చిపడుతుంది. అయిదు రోజుల పాటు విపరీతంగా కష్టపడ్డామనే ఫీలింగ్లో ఉండే కొంతమంది ఉద్యోగులు వీకెండ్ ఎప్పుడస్తుందా అంటూ ముందు నుండే ప్లాన్స్ వేస్తారు. ఆ రెండు రోజుల్లో తమకు అడ్డు ఎవరు ఉండరని గంతులేస్తారు. దీంతో మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పబ్లు, బార్లలో ఎక్కడ చూసిన సందడిగా మారుతోంది. అయితే ఈ సందడి కొన్ని సార్లు శృతిమించుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లోనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం నిర్వహించే మహిళ మద్యం మత్తులో హాంగామా సృష్టించింది. స్టేషన్లో ఉన్న మహిళా ఎస్సైతోపాటు మహిళ కానిస్టేబుల్స్పై విరుచుకుపడింది. బయటకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అడ్డుకున్న నలుగురు మహిళ కానిస్టేబుల్స్ తోపాటు ఎస్సైని బూతులు తిట్టింది. ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ చేతిని సైతం కొరికి పారి పోయోందుకు ప్రయత్నాలు చేస్తూ వారికి చుక్కలు చూపించింది. అయితే ఎట్టకేలకు మహిళను బలవంతంగా స్టేషన్లో కూర్చోపెట్టడడంతో పోలీసుల అంతు చూస్తానని హెచ్చరించింది.
హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీస్స్టేషన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి మద్యం మత్తులో రోడ్డుపై పడి పడిఉండడంతో ఆమెను స్టేషన్కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వదిలి పెట్టే యోచనలో స్టేషన్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అయితే స్టేషన్లోనే గంటపాటు ఉన్న లీసా మత్తు నుండి బయటపడిన తర్వాత పోలీసులపైకి రెచ్చిపోయింది.
తనను స్టేషన్కు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించింది. అయితే స్టేషన్లో హంగామా సృష్టించిన మహిళ నాగాలాండ్కు చెందిన లీసాగా గుర్తించారు. ఇక హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపనీలో పని చేస్తుందని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు మహిళను అదుపు చేసిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు.