హైదరాబాద్లో సొరంగ మార్గం.. కొత్త దారుల అన్వేషణ..!
హైదరాబాద్ : హైదరాబాద్లో కొత్త దారుల అన్వేషణ ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా, ఇరుకు రోడ్లు.. వెరసి ట్రాఫిక్ జామ్ నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే నగరంలో 10 రోడ్డు మార్గాలు నిర్మించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం పరిధిలో సొరంగ మార్గంతో పాటు పలుచోట్ల కొత్త రోడ్డు మార్గాల గురించి సర్వే నిర్వహించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు.. కొత్త దారులు..!
హైదరాబాద్ రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనబడతాయి. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్.. వెరసి నగరవాసికి నరకమేంటో ఇక్కడే కనిపిస్తోంది. 5 కిలోమీటర్ల ప్రయాణానికి సైతం ట్రాఫిక్ కారణంగా అరగంటకు పైగా సమయం తీసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో కొత్త రోడ్డు మార్గాల అన్వేషణలో పడింది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో భాగంగా బేగంపేట సొరంగ మార్గంతో పాటు మరో 8 రోడ్డు మార్గాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించినట్లు సమాచారం.
కొత్త రోడ్ల ప్రాజెక్టులో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ యంత్రాంగం కదిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై ఓ ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే చేయించినట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ ల్యాండ్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్ల నిర్మాణానికి సాధ్యమయ్యే మార్గాలను అన్వేషించింది సదరు సంస్థ. అలా దాదాపు 40 కిలోమీటర్లకు పైగా పొడవైన 10 మార్గాలను సూచించిందట. ఇప్పటివరకున్న ఇరుకైన రోడ్లను మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
నో సౌండ్, నో పొల్యూషన్.. హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులు
బేగంపేట - తాడ్బండ్ టన్నెల్
ఈ ప్రాజెక్టులో భాగంగానే బేగంపేట ఎయిర్ పోర్టు కింది నుంచి 2.5 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం ప్లాన్ చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించి ఓ ప్రైవేట్ ఏజెన్సీ సర్వే చేసి జీహెచ్ఎంసీ అధికారులకు ప్రతిపాదనలు కూడా ఇచ్చిందట. బేగంపేట విమానాశ్రయం మెయిన్ గేట్ నుంచి రన్ వే మీదుగా అవతలి వైపు వరకు సొరంగ మార్గం నిర్మితం కానుంది. దీంతో బేగంపేట నుంచి తాడ్బండ్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు దూరభారం తగ్గనుంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర ప్రయాణం కలిసిరానుంది.
సొరంగ మార్గం.. అధికారుల కసరత్తు
హైదరాబాద్ లాంటి మహా నగరంలో కొత్త రోడ్ల నిర్మాణం కత్తిమీద సాములాంటిదే. అయినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయక తప్పదేమో. అయితే బేగంపేట సొరంగ మార్గం నిర్మించాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ.. సాధ్యాసాధ్యాలు ఏంటనేది ప్రశ్నార్థకమే.
బేగంపేట ప్రధాన రోడ్డు నుంచి విమానశ్రయం లోనికి విశాలమైన రోడ్డు ఉంది. అయితే ఎయిర్ పోర్టు ఇక్కడినుంచి శంషాబాద్ కు తరలిపోవడంతో.. ఆ రోడ్డులో ఎలాంటి వాహనాలు తిరగడం లేదు. దానికి కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ కింది భూభాగంలో సొరంగ మార్గం నిర్మించాలని సదరు ఏజెన్సీ సూచించిందట. కొంత వరకు సొరంగ మార్గం తవ్వి.. అవతలి రోడ్డులోని మార్గాన్ని అభివృద్ధి చేస్తే చాలని ప్రతిపాదించిందట. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందడం అంతా సులువు కాదు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.