లైంగిక దాడికి పాల్పడ్డారు: బీజేపీ నేత రఘునందన్ రావుపై సీపీ సజ్జనార్కు మహిళ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్న రఘునందన్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.
సోమవారం ఉదయం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను కలిసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రఘునందన్ రావు తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
టీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు రఘునందన్ రావు. 2001 ఏప్రిల్ 27 నుంచి 2013 వరకు ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. 2013, మే 14న రఘునందన్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారన్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్.
ఆ తర్వాత ఆయన రఘునందన్ రావు బీజేపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.