పైశాచిక భర్తను తట్టుకోలేక.. నగ్నంగా రోడ్డుమీదికొచ్చిన భార్య.. కామారెడ్డి జిల్లాలో దారుణం
కలకాలం కాపాడుతాననే వాగ్ధానంతో పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. క్రమంగా మద్యానికి బానిసై భార్యను హింసించడం మొదలుపెట్టాడు.. భర్త పైశాచికం భరించలేని స్థితిలో ఆ ఇల్లాలు బట్టలు లేకుండానే సాయం కోసం రోడ్డునపడింది. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన కామారెడ్డి జిల్లా చోటుచేసుకుంది.
జిల్లాలోని బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ.. సోమవారం దుస్తులు లేకుండా రోడ్డుపైన పరుగెత్తడాన్ని చూసి స్థానికులు షాకయ్యారు. మహిళ దీన స్థితి చూసి చలించిపోయిన స్థానికులు.. ఆమెకు బట్టలు ఇచ్చి ఆదుకున్నారు. అప్పటికే తలపగిలి రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి, పోలీసులకు సమాచారం అందించారు.
తలపై కట్టుతోనే ఆస్పత్రి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళ.. తన భర్త దురాగతాలపై ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా తనను భర్త తీవ్రంగా హింసిస్తున్నాడని, సోమవారం కూడా దారుణంగా కొట్టి, ఒంమీదున్న బట్టలన్నీ చించేశాడని, నగ్నంగా బయటికి ఎలా వెళతావో చూస్తానంటూ తల పగలగొట్టాడని బాధిత మహిళ రోదిస్తూ వెల్లడించింది.
మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పైశాచిక భర్త కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలి తల్లిదండ్రులతోపాటు భర్త తల్లిదండ్రులనూ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. బట్టలు లేకుండా ఓ మహిళ సాయం కోసం రోడ్డుపై తిరుగాడిన దృశ్యాలు అందరినీ కంటతడిపెట్టించాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.