యువతిని కత్తితో పొడిచి.. ఆపై ముళ్ళ పొదల్లోకి తోసి .. మరో ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమను తిరస్కరించారని ఉన్మాదులు యువతులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. దేశంలో మహిళల, బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదులు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. యువతులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనూ తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి ముళ్లపొదల్లోకి తోసి పరారయ్యాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యువతిపై యువకుడి దాడి.. కత్తితో పొడిచి ,..ఆపై ముళ్ళ పొదల్లోకి తోసి
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా సందీప్ అనే యువకుడు ఆమె చుట్టూ తిరిగే ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా యువతి వెంటపడే వాడని బంధువులు అంటున్నారు . అయితే ఈ క్రమంలో గత రాత్రి ఆ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. మెడ మీద, పొట్టలో కత్తితో పొడిచి, తీవ్రంగా గాయపరిచి ఆమెను ముళ్లపొదల్లోకి తోసి అక్కడి నుండి పరారయ్యాడు.
పెట్రోలింగ్ పోలీసులకు దొరికిన నిందితుడు .. యువతి ఆస్పత్రికి తరలింపు
అదే క్రమంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు యువకుడు తారసపడడంతో పోలీసులు యువకుడిని అడ్డుకున్నారు. అతని చేతికి రక్తం మరకలు అంటి ఉండటం చూసి విచారించిన పోలీసులు యువతిపై దాడి చేసినట్టు యువకుడు చెప్పడంతో వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతిని చూసి ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిందితుడిపై కేసు నమోదు .. పోలీసుల దర్యాప్తు
ప్రేమించలేదని యువతి పై కత్తితో దాడి చేసిన యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడని యువతి తరపు బంధువులు పోలీసులకు చెప్తున్నారు. అతడిని వదిలిపెట్టొద్దు అని చెప్తున్నారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలలో మొన్నటికి మొన్న దివ్య తేజస్విని పై కత్తితో దాడి ఘటన మరువకముందే తెలంగాణా రాష్ట్రంలో కూడా యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది.