రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్
తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ సమయంలో అనవసరంగా తిరగకుండా డ్రోన్స్ తో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా మరోమారు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలని అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంకా అంతే కాదు నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్, ఆధార్ కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేడు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో పర్యటించారు . లాక్ డౌన్ అమలును పరిశీలించారు . రోడ్లపై తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేశారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా, కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్, ఆధార్ కార్డు కూడా తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రెస్ ను బట్టి అతను ఎక్కడి వాడు ఎక్కడ తిరుగుతున్నారు అని అంచనా వేస్తామని చెప్పారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారికి 3 కిలోమీటర్ల లోపు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలని కోరారు సీపీ సజ్జనార్. అనవసరంగా తిరిగి అడ్డంగా బుక్ కావద్దని హితవు పలికారు.