ఆరోగ్యశ్రీకి బ్రేక్.. 3రోజులుగా నిలిచిపోయిన సేవలు.. రోగుల అవస్థలు..!
హైదరాబాద్ : పేద ప్రజలకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు నిలిపివేశారు. ఇవాళ్టికి మూడు రోజులు కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రమంతటా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సేవలు అందించడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం నిర్ణయం మేరకు పలుచోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను అనుమతించడం లేదు.
మూడో రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్
శుక్రవారం నాడు ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం నేతలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వారు 1500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగులో ఉన్నాయని చెబుతుంటే.. ఈటల మాత్రం కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ప్రకటించారు.
వరుస ఎన్నికల నేపథ్యంలో బకాయిలు చెల్లించడం ఆలస్యమైందని.. ఎమర్జెన్సీ సేవలు ఆరోగ్యశ్రీ కింద అందించాలని వారికి సూచించారు. అయితే ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం మాటిచ్చి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేశారు.
మాజీ స్పీకర్ కోడెల తనయుడిపై కేసు.. వాహన విక్రయాల్లో భారీ స్కామ్..!
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
ఆదివారం నాటికి ఆరోగ్యశ్రీ కింద సేవలు అందక మూడు రోజులు అవుతోంది. ఆ క్రమంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేశామని.. ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ కేసుల్లో రోగులు, వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక బిక్కుబిక్కుమంటున్నారు.
కిడ్నీ పేషెంట్ల అవస్థలు వర్ణనాతీతం. రోజువారీ డయాలసిస్ చేయించుకునే రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ చేయడానికి ప్రైవేట్ ఆసుప్రతులు నిరాకరిస్తుండటంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు చాలామంది ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాల నుంచి గాంధీ, నిమ్స్కు క్యూ
ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు 1500 కోట్ల రూపాయలు చెల్లిస్తే గానీ ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేయలేమని ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ క్రమంలో గురువారం నాడు స్టేట్మెంట్ ఇచ్చారు. శుక్రవారం నుంచి సేవలు నిలిపివేస్తామని ఆల్టిమేటం ఇచ్చారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో మూడు రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిచిపోవడంతో జిల్లాల నుంచి హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్తో పాటు నిమ్స్కు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడ్డ నేపథ్యంలో కొందరికి తెలియక ఎమర్జెన్సీ కేసుల కింద ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదని తెలిసి మళ్లీ నిమ్స్, గాంధీ లాంటి హాస్పిటల్స్కు వెళుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.