ఈఎస్ఐ స్కాంలో మరో ముగ్గురి అరెస్ట్ , మొత్తం 16కు చేరిన నిందితులు
ఇఎస్ఐ కుంభకోణంలో మరో ముగ్గురిని ఎసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసిన వారిలో తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగి పాషాను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
రూ. 28 కోట్ల మందుల కొనుగోళ్ల అవకతవకలకు రాజేశ్వర్రెడ్డి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ ముగ్గురు పెద్దమొత్తంలో ఈఎస్ఐ మందులను ప్రయివేటు ఆస్పత్రులకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీరికంటే ముందు గత సోమవారం అరెస్ట్ అయిన వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్ రెడ్డితో పాటు కె.లిఖిత్ రెడ్డి, కె.రామిరెడ్డిలను ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం అరెస్ట్ లు 16కు చేరాయి.
కాగా ఈఎస్ఐ అక్రమాలకు సంబంధించి గత వారం రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణలో ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. దీంతో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఇఎస్ఐ డైరెక్టర్ పద్మతో కలసి అరవింద్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు ఎసిబీ అధికారులు గుర్తించారు. ఇఎస్ఐకి పరికరాలు సరఫరా చేసినట్టుగా నకిలీ పత్రాలను సృష్టించి అవినీతికి పాల్పడ్డారు.