బయటపడుతున్న ఏసీపీ భారీ అవినీతి.. రూ.100 కోట్లు పైనే... పేరున్న బడా లీడర్ బినామీలతో లింకులు..
మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ ఆయన నివాసంపై దాడి చేయగా... దాదాపు రూ.100కోట్ల పైచిలుకు ఆస్తులను గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పలు భూ వివాదాల్లో సెటిల్మెంట్లే ఆయన్ను పట్టించినట్లు తెలుస్తోంది. నర్సింహారెడ్డికి బినామీలు కూడా ఉన్నారని గుర్తించారు. అంతేకాదు,ఓ పేరున్న ప్రజా ప్రతినిధి బినామీలతోనూ నర్సింహారెడ్డికి లింకులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు... అక్రమాస్తుల ఆరోపణలు...
ఏకకాలంలో 25 చోట్ల...
బుధవారం(సెప్టెంబర్ 23) తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఒక ఏసీపీ స్థాయి అధికారి కోసం ఇన్ని బృందాలు రంగంలోకి దిగడం సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ మహేంద్రహిల్స్ లోని ఏసీపీ నర్సింహారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు,సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో దాదాపు రూ.100 కోట్ల పైచిలుకు ఆస్తులను అధికారులు గుర్తించారు. భూములకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్,భారీగా బంగారం,వెండి స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఏయే ప్రాంతాల్లో సోదాలు...
హైదరాబాద్,సికింద్రాబాద్లతో పాటు జనగామ జిల్లా వడిచర్ల,బచ్చన్నపేట,రఘునాథపల్లి,జగిత్యాల,గంగాధర,నల్గొండ,ఏపీలోని అనంతపురంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వడిచర్లలోని నర్సింహారెడ్డి అత్తగారి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే పలు గ్రామాల్లో ఏసీపీ పేరిట ఉన్న భూములను కూడా పరిశీలించారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో నర్సింహారెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్ల ఆరోపణలపై లోతుగా విచారిస్తున్నారు.
ఎవరా రాజకీయ నేతలు...
భూ వివాదాల సెటిల్మెంట్లే ఏసీపీని పట్టించాయని తెలుస్తోంది. కొండాపూర్లో మధుకర్ అనే వ్యక్తి ద్వారా అసైన్డ్ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీపీ ఏసీబీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. ఘట్కేసర్ సమీపంలోని ఓ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీపీ కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. నిజాం కాలం నాటి ఈ భూమిని కొంతమంది రాజకీయ నేతలతో కలిసి ఏసీపీ కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఆ రాజకీయ నేతలెవరు అన్న దానిపై ప్రస్తుతం ఫోకస్ చేసినట్లు సమాచారం.
రూ.100 కోట్ల పైచిలుకు ఆస్తులు...
దాదాపు అర్ధరాత్రి వరకూ ఏసీబీ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. మాదాపూర్లోని సైబర్టవర్ ఎదుట నాలుగు ఫ్లాట్లు( 1,960 చదరపు గజాలు),హఫీజ్పేటలో మూడంతస్తుల భవనం,రెండు ఓపెన్ ప్లాట్లు,అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి,రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు,బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు నగదు ఇప్పటివరకూ గుర్తించిన ఆస్తుల్లో ఉన్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది.
Recommended Video
బడా లీడర్ బినామీలతో లింకులు...
హైదరాబాద్లో ఓ బడా లీడర్ బినామీలతోనూ ఏసీపీ నర్సింహారెడ్డికి లింకులు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. నగరంలోని ఓ బార్ యజమాని ఏసీపీకి బినామీగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఏసీపీ అక్రమార్జనను మేనేజ్ చేయడంలో అతనే కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు సమాచారం.