esi స్కాంలో బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మీ ఆస్తులు.. బిల్డర్ నుంచి రూ.4 కోట్లు, రికవరీ..
తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా నగదు ఇచ్చారనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. దీంతో మరోసారి తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కాం చర్చకు దారితీసింది.
బిల్డర్ నుంచి రూ.4.47 కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బిల్డర్ ఆస్తులను అటాచ్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఆ డబ్బును అధికారులకు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రూ.3.37 కోట్లు దేవికారాణికి చెందిన నగదు కాగా.. మిగతా మనీ నాగలక్ష్మికి చెందినదని విశ్వసనీయ సమాచారం. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఈఎస్ఐలో నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన ఏసీబీ దేవికారాణి, పద్మ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో కోటి 76 లక్షల స్కాం జరిగిందని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
Recommended Video
మెడికల్ కిట్ల పేరుతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సిబ్బంది స్కాం చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. దేవికారాణి అండతోనే కుంభకోణం జరిగిందని వెల్లడించారు. 2017-18లో మెడికల్ కిట్ల కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఇందులో మొత్తం 22 ఇండెంట్లు ఉన్నాయి. 2 ఇండెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించి..ఇందులో స్కాం జరిగినట్టు గుర్తించారు.