లెక్చరర్స్ ఫోరం బాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు, నగదు, డిపాజిట్ పత్రాలు స్వాధీనం
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, అతని బంధువులు, స్నేహితుల, బినామీల ఇంట్లో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహిస్తోంది. దాడుల్లో భారీగా అవినీతి సొమ్ము బయటపడుతుంది. ఉదయం నుంచి ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లలో అవినీతి సొమ్ము బయటపడింది.
మధుసూదన్ రెడ్డి దిల్సుఖ్నగర్ వైష్ణవి అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు. అతని ఇంటితోపాటు స్నేహితులు, బంధువుల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి బినామీ మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. బ్యాంకులో రూ.52 లక్షల నగదు, రూ.52 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదు ఎక్కడిదీ ? ఎవరిచ్చారు అనే అంశాలపై కూపీ లాగుతున్నారు.
మరోవైపు రూ.16 లక్షల నగదు సీజ్ చేశారు. డబ్బుకు సంబంధించి రసీదు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఓ బిల్డింగ్కు సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. ఆ భవంతి విలువ దాదాపు రూ.1.84 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు నాంపల్లిలోని మధుసూదన్ రెడ్డి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక్కడ పలు విలువైన పత్రాలు లభించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.