మల్కాజ్గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు... అక్రమాస్తుల ఆరోపణలు...
హైదరాబాద్లోని మల్కాజ్గిరి ఏసీపీ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం(సెప్టెంబర్ 22) ఉదయం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. ముఖ్యంగా పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లలో ఆయన హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. అలాగే బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. గతంలో నరసింహారెడ్డి ఉప్పల్ సీఐగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట, ఉప్పల్ సహా 20 ప్రాంతాల్లోని నరసింహారెడ్డి బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే . వరంగల్ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయితే నరసింహారెడ్డి అక్రమాస్తుల వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా, ఏసీపీ నరసింహారెడ్డి మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు.
గతంలో కూకట్పల్లి ఏసీపీ సంజీవరావును కూడా అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్హెచ్ఓల పరిధిలోని పలు కేసుల్లో సంజీవరావు తలదూర్చి అక్రమార్జనకు తెరలేపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోనూ డబ్బులు డిమాండ్ చేసి రాజీ కుదిర్చినట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బినామీ ఆస్తులను గుర్తించారు.