పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీ
హైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు ఆ వెహికిల్ను నడుపుతూ న్యూసెన్స్ సృష్టించారని మీడియాలో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు అలర్టయ్యారు. ఆ మేరకు ఇంటర్నల్ విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. ఓ సీఐని బాద్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాజాగా పెట్రోలింగ్ వాహనంలో కొందరు యువకులు చక్కర్లు కొట్టారు. సైరన్ మోగిస్తూ, కేరింతలు కొడుతూ, నానా రచ్చ చేస్తూ హంగామా సృష్టించారు. అయితే దానికి సంబంధించిన వార్తలు అటు మీడియాలో రావడంతో పాటు ఇటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దాంతో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు.
అత్త మీద అల్లుడి పగ.. పోర్న్ సైట్లలో ఆమె నెంబర్.. లైంగిక వేధింపులు తట్టుకోలేక..!
పోలీస్ వాహనం అలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడంపై మండిపడ్డారు. శాంతిభద్రతల కోసం వినియోగించాల్సిన వాహనం ఇలా ఇతరుల చేతికి వెళితే ఎట్లా అని మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం ఏరియాలో పోలీసులు పెట్రోలింగ్కు వాడే గస్తీ వాహనంలో రెండు రోజుల కిందట కొందరు యువకులు రాష్ డ్రైవింగ్ చేస్తూ నానా రచ్చ చేసిన వీడియో వైరల్ అయింది.
అందులో ఉన్నోళ్లంతా మైనర్ యువకులే కావడం గమనార్హం. అయితే ఆ పెట్రోలింగ్ వాహనానికి ఓ సీఐ బాధ్యుడిగా ఉన్నారు. అతడి పుత్రరత్నం.. తన స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దాంతో సదరు సీఐని మందలించడమే గాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మెమో జారీ చేశారు.