తెలంగాణ డీజీపీపై బండి సంజయ్ గరంగరం: ఎన్నికల కమిషన్పైనా: సజ్జనార్ సీరియస్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ఘాటు వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్కు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. చట్టపరంగా చర్యలను ఎదుర్కొనే సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది. ప్రత్యేకించి- పోలీస్ డైరెక్టర్ జనరల్ పీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నామని అన్నారు. లీగల్ ఒపీనియన్ను తీసుకున్న తరువాత ఆయనపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఉన్నత స్థానాల్లో కొనసాగుతోన్న అధికారులను ఉద్దేశించి ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అయినప్పటికీ.. విధి నిర్వహణలో ఉన్న అధికారుల విషయంలో బాధ్యతగా ఉండాల్సి ఉంటుందని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కుట్ర పన్నుతోందని బండి సంజయ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఇష్టానురాజ్యంగా డబ్బులను పంచుతూ అక్రమంగా అందలం ఎక్కాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు పంచే డబ్బులను తీసుకుని, తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. పోలీసులు వారిని అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ అధికారులు, రాష్ట్ర డీజీపీ.. అధికార పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా, పావులుగా మారిపోయారని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ.. పోలీస్ అధికారిగా పనిచేయాలని, టీఆర్ఎస్ ఏజెంట్గా కాదని సూచించారు. టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేయాల్సి వస్తే.. శాంతిభద్రతలు కట్టుతప్పుతాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.