లాయర్ వామన్రావు దంపతుల హత్య: ముగ్గురిపై ఎఫ్ఐఆర్, ఏ1గా కుంట శ్రీనివాస్, ఏ2,3 ఎవరంటే?
హైదరాబాద్/పెద్దపల్లి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు(49), నాగమణి(45) దంపతుల హత్య కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు 120బీ, 302,341,34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
న్యాయవాది దంపతుల హత్య కేసులో ఏ1గా కుంట శ్రీను
వామన్ రావు దంపతుల హత్య కేసులో ఏ1గా కుంట శ్రీనివాస్(శ్రీను), ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్ను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాగా, కత్తితో దాడి చేసి నిందితులు పారిపోయిన తర్వాత రోడ్డుపై పడివున్న వామన్ రావును స్థానికులు 'ఎవరు హత్యాయత్నం చేశారు' అని ప్రశ్నించగా.. కుంట శ్రీనివాస్ అని చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
మంథని-పెద్దపల్లి ప్రధాని రహదారిపై..
బుధవారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గట్టు వామన్ రావు, నాగమణి దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కారులు మంథని నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే అందరూ చూస్తుండగానే నిందితులు ఈ దంపతులను దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మంథని నుంచే వెంబడించిన దుండగులు
హైకోర్టులో న్యాయవాదులైన వామన్ రావు, నాగమణి దంపతుల స్వస్థలం మంథని మండలం గుంజపడుగు గ్రామం. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. ఇసుక క్వారీయింగ్ వంటి అక్రమాలపైనా వారు హైకోర్టుకు లేఖలు రాశారు. బుధవారం ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్ సతీశ్తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మంథని నుంచే వీరి కారును వెంబడించిన దుండగులు.. కల్వచర్ల వద్ద అడ్డగించారు.
హత్యను చూసి కేకలు వేసిన ప్రయాణికులు
ఆ తర్వాత కొబ్బరిబొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్ రావును కిందకు లాగారు. కిందపడ్డ అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతని మెడ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణిని కూడా దుండగులు కత్తులతో నరికి చంపారు. అప్పటికే ఈ దారుణంతో రహదారిపై వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథనివైపు తమ కారులో పరారయ్యారు. కొందరు వీడియోలు తీస్తే.. కొందరు 108 సిబ్బందికి సమాచారం అందించారు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన అడ్వోకేట్ దంపతుల హత్య
అంబులెన్స్లో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతిచెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కల్వచర్లకు చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది. వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా అఖిలపక్షం మంథని మండల బంద్ కు పిలుపునిచ్చాయి. హైకోర్టు న్యాయవాదులు నిరసన చేపట్టారు. అడ్వోకేట్ దంపతుల హత్యపై హైకోర్టు కూడా స్పందించింది. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించింది. ఈ కేసును సుమోటా తీసుకున్న హైకోర్టు.. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయవాదుల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. కాగా, లాయర్ల హత్యలకు నిరసనగా హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.