గ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఇంకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా అనూహ్య పరిణామాం చోటుచేసుకుంది. పాతబస్తీలోని రెండు డివిజన్లలో రీపోలింగ్ చేపట్టే అవకాశాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు గురువారం తెలంగాణ ఎన్నికల కమిషన్ కు సూచించింది. మరోవైపు, మేయర్ ఎన్నికలో కీలక భూమిక పోషించే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపైనా హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీలు, పోలీసులు సన్నద్ధమయ్యారు. వివరాలిలా ఉన్నాయి..
GHMC Elections 2020 Exit Poll Results -నాగన్న సర్వేలోనే టీఆర్ఎస్కు 100 -బండి సంజయ్ తుస్
చివరి గంటలో రిగ్గింగ్..
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్ పై భిన్నాభిప్రాయాలు రావడం, చివరికి పోలింగ్ శాతం గతంలో కంటే ఎక్కువ నమోదైనట్లు అధికారులు ప్రకటించడం తెలిసిందే. కాగా, ఎన్నికల కమిషన్ అండతో అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడు ఏఐఎంఐఎం పోలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డాయని, చివరి గంటలో రిగ్గింగ జరడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని విపక్షాలు ఆరోపించాయి. బీజేపీ మరో అడుగు ముందుకేసి.. పాతబస్తీలోని ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో చివరి గంటలో ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆధారాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథికి ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై హైకోర్టులోనూ పిటిషన్ వేయగా..
ఎస్ఈసీకి హకోర్టు సూచన..
రిగ్గింగ్ పై బీజేపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం విచారించిన హైకోర్టు.. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ) సూచించింది. మంగళవారం పోలింగ్ రద్దైన ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో గురువారం రీపోలింగ్ నిర్వహించిన ఎస్ఈసీ.. శుక్రవారం 150 డివిజన్లకూ కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోగా, హైకోర్టు తాజా సూచన కీలకంగా మారింది. రిగ్గింగ్ ఆరోపణలపై ఇప్పటిదాకా నోరువిప్పని ఎన్నికల కమిషన్.. హైకోర్టు సూచనపైనా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే కౌంటింగ్ యథావిధిగా కొనసాగుతుందా? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు..
ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు అవసరమా?
మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపైనా గురువారం హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ.. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1) కొట్టివేయాలని పిటిషన్లో అనిల్ కుమార్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నెలరోజులకు (జనవరి 4కు) వాయిదా వేసింది. ఇదిలా ఉంటే..
గ్రేటర్లో 48 గంటలపాటు ఆంక్షలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలతోపాటు సిటీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశామని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. 15 కౌంటింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని, కౌంటింగ్ సెంటర్ల వద్ద 200 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతి ఉండదని, పత్రాలు ఉన్నవారిని మాత్రమే లోనికి పంపిస్తామని, అందరూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. గ్రేటర్ పరిధిలో 48 గంటల వరకు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.