ఇక ‘టిక్టాక్’లో..: తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం!
హైదరాబాద్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వేదికలు కీలకంగా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడు టిక్టాక్ కూడా దూసుకెళుతోంది. ఇటీవల నిషేధానికి గురైన అశ్లీల కంటెంట్కు తావులేకుండా చూసుకుంటోంది టిక్టాక్.
ఇప్పటి వరకు సరదా కోసమే యువత, పెద్దలు ఈ యాప్ను ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈ వేదికపైకి వస్తున్నాయి. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా టిక్టాక్లో ఖాతా తెరిచింది. కాగా, ఇలా టిక్టాక్లో అధికారిక ఖాతా తెరిచిన తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం అవతరించింది.
టిక్టాక్ వేదికగా మరింత మంది కార్యకర్తలు, నేతలకు చేరువయ్యేందుకు ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కేంద్రంగా ఏర్పడిన ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహదుల్ ముస్లమీన్(ఏఐఎంఐఎం) పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది.
ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాల్లో పార్టీ కార్యక్రమాలు, నేతల ప్రసంగాలు పోస్టు చేస్తోంది. కార్యకర్తలు, నేతల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న టిక్టాక్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. టిక్టాక్లో ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం 7వేలకు పైగా ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ ఛైర్మన్ పదవి ఎంఐఎంకు దక్కింది. ఎంఐఎం శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దీన్ ఓవైసీ పీఏసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఐఎం కోరుతోంది. దీంతో తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలోనే నిర్ణయం వెలువడింది.
శాసన సభలో ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) క్యాబినెట్ హోదాతో కొనసాగుతోంది. సాధరణంగా ఈ కమిటీకి చైర్మన్ను ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన అధినేత సూచనలతో పీఏసీ ఛైర్మన్ను అసెంబ్లీ ప్రకటిస్తుంది. అయితే తెలంగాణ అసెంబ్లీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ సభ్యులు మొత్తం 12 మంది ఇటీవల టీఆర్ఎస్లో విలీనమైన విషయం తెలిసిందే.. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కొల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఏడుగురు సభ్యులతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.