ట్రాఫిక్ పోలీస్గా మారిన అసదుద్దీన్.. కార్యకర్తలకు స్పూర్తిగా ఎంఐఎం అధినేత
రాజకీయాల వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహద్ ఉల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ పోలీస్గా మారారు. శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో జరిగిన ర్యాలీ అనంతరం ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అసదుద్దీన్ రంగంలోకి దిగారు. వాహనాలను రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేశారు. తమ నేత రోడ్డు పక్కన నిలబడి ట్రాఫిక్ను క్లియర్ చేయడం చూసిన కార్యకర్తలు కూడా రంగంలోకి దూకారు.
ఇదిలా ఉండగా, సీఏఏ ఆందోళన కార్యక్రమం అనంతరం మీడియాతో అసదుద్దీన్ మాట్లాడుతూ తిరంగా యాత్రకు సంబంధించిన మార్చ్ రాజకీయాలకు అతీతంగా జరిగిందని అన్నారు. ఈ ఆందోళనకు రాజకీయాలతో సంబంధం లేదు. దేశాన్ని బలపేతం చేసే శక్తి తిరంగ జెండాకు ఉంది. కొందరు జాతీయ జెండాను పట్టుకొని నాథురాం గాడ్సేకు జై కొడుతుంటారు. కానీ మేము తిరంగా జెండాను పట్టుకొని మహాత్మ గాంధీ, బీఆర్ అంబేద్కర్ను కీర్తిస్తాం అని అసదుద్దీన్ అన్నారు.
హైదరాబాద్ నగర వీధుల్లో ప్రతీ ఒక్కరు త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని తిరగడం చూసి ప్రజలు హ్యాపీగా ఫీలయ్యారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. నాకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఇంటర్నెట్లో కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. మాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది. అందుకే నిరసనను తెలుపుతున్నాం. కోర్టు ఏది చెప్పినా దానికి మేము కట్టుబడి ఉంటాం అని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.