కేసీఆర్ సర్కారును కూల్చేందుకు 2 నెలలు చాలు, కేటీఆర్ ఓ చిలుక: ఎంఐఎం ఎమ్మెల్యే షాకింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు వేడిని మరింత పెంచుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న ఎంఐఎంకు ఆ పార్టీకి మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి.
Recommended Video
టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు రెండు నెలలు చాలు
తాజాగా, చార్మినార్ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తాము తలచుకుంటే రెండు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ముంతాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను నిలబెట్టడం, కూల్చడం తమ పార్టీకి పెద్ద పనికాదని అన్నారు.
కేటీఆర్ ఓ చిలుక.. రాజకీయం మా గుమస్తా..
అంతేగాక, తెలంగాణ మంత్రి కేటీఆర్పైనా ముంతాజ్ విమర్శలు చేశారు. కేటీఆర్ను చిలుకతో పోల్చారు. నిన్నమొన్న రాజకీయాల్లో కళ్లు తెరిచాడని వ్యాఖ్యానించారు. తమ అధినేత చెప్పినట్లు రాజకీయం మా ఇంటి గుమస్తాతో సమానమని వ్యాఖ్యానించారు. బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వకుండానే ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించామన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గానే..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలో టీఆర్ఎస్ పార్టీ 10 సీట్లకు పైగా గెలుస్తుందని ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ముంతాజ్ ఖాన్ ఈ మేరకు స్పందించారు. కాగా, గతవారం జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, 150 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. అంతేగాక, పాతబస్తీలో 10 సీట్లకుపైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయంగా హాట్టాపిక్గా ముంతాజ్ కామెంట్స్
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, మేయర్ పీఠాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని గులాబీ పార్టీపై బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మొదట్నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న విధానాలకు, పథకాలకు ఎంఐఎం పార్టీ మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.