కేసీఆర్తో అక్బరుద్దీన్ భేటీ: లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం, అఫ్జల్ గంజ్ మసీదు..!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు దైవభక్తి కాస్త ఎక్కువే. తరచూ ఆలయాలను సందర్శిస్తుండటం, యజ్ఙ యాగాదులను నిర్వహించడం ఆయనకు అలవాటు. ఆలయాల జీర్ణోద్ధరణకు గానీ, కొత్త దేవస్థానాల నిర్మాణానికి గానీ అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఆలయాలతో పాటు మసీదుల మరమ్మతులకు కూడా నిధులను మంజూరు చేయాలని కోరుతూ అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకులు ఆయనను కలిశారు.
బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !
ఏఐఎంఐఎం సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ సారథ్యంలో పలువురు నాయకులు కేసీఆర్ను కలిశారు. తన నియోజకవర్గం చాంద్రాయణ గుట్ట పరిధిలోని ఆలయాల జీర్ణోద్ధరణ, మసీదుల మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఓ వినతిప్రతాన్ని ఆయన కేసీఆర్కు అందజేశారు. ప్రఖ్యాతి గాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయాన్ని జీర్ణోద్ధరించాల్సి ఉందని, దీనికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు.
లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనుల కోసం 10 కోట్లు, అఫ్జల్ గంజ్లోని ప్రాచీన మసీదు మరమ్మతుల కోసం మూడు కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. పాతబస్తీ పరిధిలోని పలు హిందూ ఆలయాలు, మసీదులు మరమ్మతులకు నోచుకోవట్లేదని అన్నారు. ఆలయాలు, మసీదులు దయనీయ స్థితిలో ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా చూడటానికి పాతబస్తీలో పర్యటించాలని ఆయన కేసీఆర్ను కోరారు. వాటిని అభివృద్ధి చేయడానికి నిధులను మంజూరు చేయాలని చెప్పారు.
కేసీఆర్తో అక్బరుద్దీన్ భేటీ: లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం, అఫ్జల్ గంజ్ మసీదు..!#AkbaruddinOwaisi #KCR #AIMIM pic.twitter.com/EiQzg8til5
— Oneindia Telugu (@oneindiatelugu) February 9, 2020
దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. పాతబస్తీ పరిధిలోని ఆలయాలు, మసీదు, చర్చిల నిర్వహణ, వాటి స్థితిగతులపై కేసీఆర్ ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆయన ఇదే సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. దీనికోసం జీహెచ్ఎంసీ అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. వీలు చూసుకుని పాతబస్తీలో పర్యటిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్.. అక్బరుద్దీన్ ఒవైసీకి హామీ ఇచ్చారు.