కిషన్ రెడ్డి మెడకు బండి సంజయ్ వ్యాఖ్యలు: రాజీనామాకు ఒవైసీ డిమాండ్: టీఆర్ఎస్ సైతం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోటు, సమస్యలు.. పక్కదారి పట్టాయి. వాటి స్థానంలో మతం ఆధారంగా ప్రచారం సాగుతోందనే వాదనలు ఉన్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి, ఆక్రమణలు, వరదల్లో ప్రజలు పడ్డ సమస్యలు ఇలాంటివి అంశాల నుంచి ప్రచార పర్వం పక్కదారి పట్టిందని, మతం చుట్టూ పరిభ్రమిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మౌలిక సమస్యల అంశం ఎంత ప్రస్తావనకు రాకపోతే.. టీఆర్ఎస్కు అంత లబ్ది కలగడం ఖాయమని అంటున్నారు.
బండి సంజయ్ ఫైర్.. గ్రేటర్లో మిస్ ఫైర్?
బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్కు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. అలాంటి వైకరే ఆయనకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రశాఖ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులను వేయడంలో ఆయన వ్యవహార శైలి, దూకుడు.. దుబ్బాక ఉప ఎన్నికలోనూ కమలానికి గెలుపును తెచ్చిపెట్టిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు అదే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇబ్బందులను సృష్టిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బండి సంజయ్లోని ఫైర్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మిస్ ఫైర్ అయిందని అంటున్నారు.
కిషన్ రెడ్డిని ఇబ్బందుల్లో నెడుతోందా?
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ తనకు అలవాటైన రీతిలో ప్రదర్శిస్తోన్న ఎదురుదాడి వ్యవహారం మొత్తం..పార్టీకి చెందిన సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డికి ఇబ్బందులను తెచ్చిపెడుతోందని చెబుతున్నారు. ప్రత్యేకించి- సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తినట్టు కనిపిస్తోంది. పాతబస్తీలో పాకిస్తానీయులు, రోహింగ్యాలు తిష్ట వేశారని, వారిని ఏరి పారేస్తామని, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
నైతికి బాధ్యత లేదా?
బండి సంజయ్ చేసిన ఆ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెలరేగిపోతున్నారు. పాకిస్తానీయులు, రోహింగ్యాలు భారత్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై ఉందని, సాక్షాత్తూ కేంద్ర కేబినెట్లో ఆ శాఖకే ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జీ కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఒవైసీ ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాయులు, రోహింగ్యాలు పెద్ద ఎత్తున పాతబస్తీలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు చెబుతోండగా.. వారిని అడ్డుకోవడంలో సొంత పార్టీకే చెందిన కిషన్ రెడ్డి విఫలమైనట్టేనని విమర్శిస్తున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఒవైసీ.
Recommended Video
హిందువుల ఓటుబ్యాంకు కోసమే..
హిందువుల ఓటుబ్యాంకును ఆకర్షంచడానికి బండి సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారనడంలో సందేహాలు అక్కర్లేదు. అవి కాస్తా బూమరాంగ్ కావడమే ఇప్పుడు బీజేపీ నేతలకు కొత్త సంకట స్థితిలోకి నెడుతోంది. అన్ని మతాల వారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి నివసించే హైదరాబాద్కు మినీ ఇండియాగా పేరుందని, అలాంటి నగరంలో మతాన్ని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలోకి దిగడం ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనేది..ఓట్ల లెక్కింపు నాడే తేలుతుంది.
ఈ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలను మజ్లిస్ మాత్రమే కాదు.. టీఆర్ఎస్ సైతం రాజకీయంగా ఎదురుదాడికి వాడుకుంటోంది. తిప్పికొడుతోంది. కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అని ప్రశ్నిస్తారా? అంటూ నేరుగా ప్రశ్నలను సంధిస్తోంది.