ఇంజిన్ ఆఫ్: హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: ఎయిర్ ఏషియాకు చెందిన ఓ విమానం మంగళవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. జైపూర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన i51543 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈ క్రమంలో 78 మంది ప్రయాణికులతో వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఛండీగఢ్-బెంగళూరు విమానంలో ఆ విమాన ప్రయాణికులను పంపించారు.
కాగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఏషియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. తమ పైలట్లు, సిబ్బంది అనుభవం కలిగిన వారు కావడంతో ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చారని తెలిపింది.
తమకు ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని వెల్లడించింది. విమానంలో సమస్యకు కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, విమానంలో ఒక ఇంజిన్ ఆఫ్ అయినట్లు సమాచారం. ఇంధనం లీకేజీ అయినట్లు తెలిసింది. ఇది ఇలావుంటే, దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.