సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు తప్పిన ముప్పు: హైదరాబాద్కు వస్తుండగా: ఎమర్జెన్సీ: విమానం వెనక్కి
హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు ముప్పు తృటిలో తప్పింది. ఆయనతో పాటు పలువురు ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనితో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. కోల్కతలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ తీసుకున్న విమానం మళ్లీ సురక్షితంగా వెనక్కి తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కోల్కతలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ వెల్లడించారు.
త్రిపుర హైకోర్టులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే పాల్గొన్నారు. అనంతరం ఆయన బుధవారం రాత్రి కోల్కత నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. ఇక్కడి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన మహారాష్ట్రలోని నాగ్పూర్కు బయలుదేరాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. కోల్కత విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ విషయాన్ని పైలెట్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు తెలియజేశారు.
దీనితో విమానాశ్రయం అధికారులు పూర్తి అత్యవసర పరిస్థితి (ఫుల్ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. విమానాన్ని వెనక్కి రప్పించారు. ఫ్లయిట్ కోల్కత ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరికీ నివాస వసతి కల్పించారు. ఎస్ఏ బొబ్డే సహా ప్రయాణికులందరినీ గురువారం హైదరాబాద్కు పంపిస్తామని కోల్కత ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. విమానంలో సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయని, ప్రముఖులు ఉండటం వల్ల ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.