బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు: పోలీస్ కస్టడీలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్..?
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. ప్రవీణ్కుమార్, అతడి సోదరుల కిడ్నా్పలో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను రాబడుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో 19 మంది నిందితులు అని పోలీసులు గుర్తించగా.. అఖిల ప్రియ, సోమవారం అరెస్టయిన ముగ్గురితోపాటు.. తాజాగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవరామ్, గుంటూరు శ్రీను ఉన్నారు.

గాలిస్తున్నాం: పోలీసులు
పరారీలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మాత్రం.. భార్గవరామ్, గుంటూరు శ్రీను కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అయితే.. నిందితులను గుర్తించామని, ఏ క్షణంలో అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ మండలాల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం గోవాలో ఒకరిని, వైసీపీ నేత వెంకటేశ్వరరావు కుమారులు వంశీ, సాయిహర్షతోపాటు టీ భాను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కిడ్నాప్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

స్కెచ్ అక్కడ వివరణ
గుంటూరు శ్రీను వీరికి కిడ్నాప్ స్కెచ్ గురించి వివరించి, హైదరాబాద్కు రప్పించినట్టు ఆధారాలు సేకరించారు. అఖిలప్రియ సోదరుడు జగత్విఖ్యాత్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో అతని డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించారని తెలిసింది. అఖిలప్రియ అరెస్టు సమయంలోనూ.. పోలీసులు జగత్ విఖ్యాత్ను విచారించారు.

బెంగళూరులో చర్చలు.. విఫలం కావడంతో
హఫీజ్పేట్ భూ వివాదానికి సంబంధించి భూమా కుటుంబీకులు.. ప్రవీణ్ కుటుంబీకులు గతంలో బెంగళూరులో పలుమార్లు చర్చలు జరిపారని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ ఘటనకు కొద్దీరోజుల ముందు కూడా సమావేశం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ భేటీలో కొందరు పెద్దలు ఇరువర్గాల తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.

రెండోరోజు విచారణలో ప్రశ్నల వర్షం..
కస్టడీలో ఉన్న అఖిల ప్రియను పోలీసులు రెండో రోజూ విచారించారు. మంగళవారం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్త్జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ నేతృత్వంలో ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు అఖిల ప్రియ మౌనంగా ఉన్నట్లు తెలిసింది. కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది.