అందరూ ఇండియన్లే, బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్లపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ అటాక్
గ్రేటర్ ప్రచారం రంజుమీదికొచ్చింది. నేతల సవాళ్లతో హీటెక్కింది. ఎముకలు కొరికే చలిలో కూడా అగ్గిరాజేసింది. బల్దియాలో బీజేపీ గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై ఇప్పటికే కేటీఆర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బండి సవాల్కు ప్రతి సవాల్ విసిరారు.
అందరూ భారతీయులే
దేశంలో ఉన్నవారంతా ఇండియన్లే అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీకి 24 గంటల సమయం ఇస్తున్నాం అని.. పాతబస్తిలో పాకిస్తాన్ వాళ్లెవరు ఉన్నారో చెప్పాలని కోరారు. లేని వారిని ఉన్నట్టు ఊహించుకోవడం తగదన్నారు. దేశంలో చైనా 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అక్రమించిందని అసదుద్దీన్ చెప్పారు. దమ్ముంటే అక్కడకు వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేయాలని కోరారు. దేశం నుంచి ముస్లింలను వేరు చేయలేరని అసద్ స్పష్టంచేశారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ అంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి గెలవాలి అని బీజేపీకి అసదుద్దీన్ సూచించారు.
సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం..
అంతకుముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్నారు. అక్కడున్న రోహింగ్యాలను, పాకిస్థాన్ వారిని తరిమి తరిమి కొడతాం అని హెచ్చరించారు. సిటీలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Recommended Video
రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు..
బండి సంజయ్ సవాల్కు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదీ కేవలం ఎన్నికల జిమ్మిక్కుగా ఆయన అభివర్ణించారు. విజ్ఞులైన ఓటర్లకు అన్నీ తెలుసు అనీ చెప్పారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్నవారికి బుద్ది చెప్పాలని ఆయన కోరారు.