డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న వన్-ఇండియా: అల్లం నారాయణ, దేవులపల్లి అమర్
హైదరాబాద్: డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా(తెలుగు)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇదే వేగంతో వార్తలు అందించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రెస్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్ శుక్రవారం అన్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా వన్ ఇండియా (One India) డిజిటల్ మీడియా రంగంలో సత్తా చాటుతోంది. తొలి మల్టీ లాంగ్వేజ్ వెబ్ న్యూస్ వెబ్ ఛానల్ వన్ ఇండియా!
దక్షిణాదిలోని తెలుగు, తమిళం, కన్నడ, మళయాళంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వన్ ఇండియా న్యూస్ను ఎప్పటికప్పుడు రీడర్స్కు అందిస్తోంది. కొన్నేళ్ల క్రితం గుజరాతీ, బెంగాలీ భాషల్లోను వెబ్ సైట్స్ను ప్రారంభించింది. తెలుగులోను ఎప్పటికప్పుడు వార్తా సమాహారాన్ని అందించే వన్ ఇండియా (తెలుగు) శుక్రవారం (19-7-2019) హైదరాబాదులో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి అల్లం నారాయణ, దేవులపల్లి అమర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
డిజిటల్ మీడియా రంగంలో వన్ ఇండియా (తెలుగు) ప్రత్యేక స్థానం కలిగి ఉందని అల్లం నారాయణ అన్నారు. వెబ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిజంగా హర్షించదగ్గ విషయమని ప్రశంసించారు. ముందుముందు వన్ ఇండియా వార్తా రంగంలో ఎన్నో సంచలనాలు నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లం నారాయణ తెలిపారు. ఇప్పుడు కొత్త కార్యాలయంలోనూ వన్ ఇండియా అంతే వేగంతో, అంతే పారదర్శకతతో వార్తలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.
డిజిటల్ మీడియాలో మరింత కీలకపాత్ర పోషించి, ప్రజలకు సమాచారాన్ని ఇంతే వేగంగా అందించాలని దేవులపల్లి అమర్ ఆకాంక్షించారు. సుదీర్ఘ అనుభవం, జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులను ఆయన అభినందించారు. వన్ ఇండియా తెలుగులో మరింత విస్తరించడం ద్వారా మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే కోశాధికారి మారుతీ సాగర్, వన్ ఇండియా హెచ్ఆర్ కే మహేష్, వన్ ఇండియా అడ్మిన్ బాలరాజు, వన్ ఇండియా (తెలుగు) ఎడిటర్ బలరాం, వన్ ఇండియా ఫిల్మ్ బీట్ చీఫ్ రాజబాబుతో పాటు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.