అబార్షన్ల అడ్డా ఆమన్గల్ గడ్డ..! కీర్తి రెడ్డి కేసులో హాస్పిటల్ సీజ్..!!
హైదరాబాద్ : హయత్ నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికైంది. తల్లిని సొంత కూతురే అత్యంత పాశవికంగా హతమార్చడం సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన కీర్తి రెడ్డి తెలిసి తెలియక చేసిన తప్పు ఇప్పుడు మూడు కుటుంబాల పరువు రోడ్డెక్కించింది. మొదటి ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన కీర్తి రెడ్డి అబార్షన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని పెద్ద తప్పు చేసింది.
అదే అతడికి అస్త్రంగా మారి చివరకు కీర్తి రెడ్డిని ఉసిగొల్పి తల్లి హత్యకు ప్రేరేపించినట్లైంది. అయితే ఈ కేసు ఇప్పుడు ఆమన్గల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తి రెడ్డికి అక్కడ గర్భస్రావం ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగ లాగుతున్నారు పోలీసులు. మరోవైపు రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిన విషయంలో తీగ లాగితే డొంక కదిలింది. ఆమన్గల్ లోని పద్మ నర్సింగ్ హోమ్లో ఆమెకు గర్భస్రావం చేసినట్లు నిర్ధారించారు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు. ఆ మేరకు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి. నిబంధనలు అతిక్రమించి అబార్షన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హయత్నగర్ టు ఆమంగల్.. కీర్తి రెడ్డికి అబార్షన్ చేసిందెవరు.. తల్లి హత్య కేసులో మరో కోణం..!
కీర్తి రెడ్డితో ప్రేమాయణం నడిపిన బాల్రెడ్డి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ క్రమంలో గర్భం దాల్చడంతో ఎల్బీ నగర్లోని ఓ వైద్యుడిని అబార్షన్ చేయాల్సిందిగా అభ్యర్థించారు. అయితే హైదరాబాద్లో ఇలాంటి కేసులు కష్టమని.. ఆమన్గల్ లోని పద్మ నర్సింగ్ హోమ్కు వెళ్లాలని సూచించాడు. దాంతో పక్కింటి కుర్రాడైన శశి కుమార్ను సాయం కోరి తమ వెంట తీసుకెళ్లింది కీర్తి.
అదే ఆమె పాలిట శాపంలా తయారైంది. ఆ తర్వాత అబార్షన్ విషయం ఇంట్లో చెబుతానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ వత్తిడి పెంచాడు. ఆ క్రమంలో డబ్బుల కోసం కన్నతల్లిని చంపేసింది కీర్తి. ఈ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తున్న క్రమంలో తాజాగా కీర్తికి అబార్షన్ చేసిన ఆసుపత్రిని సీజ్ చేయడం విశేషం.