పంజాగుట్టలో అంబేడ్కర్ కాంస్య విగ్రహంపెట్టాలి..! అఖిల పక్షనేతల డిమాండ్..!!
హైదరాబాద్: రాజ్యంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం అంశంలో అఖిలపక్ష నేతల్లో ఏకాభిప్రాయం కుదిరింది. పంజాగుట్టలో బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపి నేత కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పంజాగుట్ట ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ, పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు కొన్ని ప్రకటనలు చేసినా దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోని విషయాన్ని గవర్నర్ తెలియజేసినట్టు చెప్పారు. అంబేడ్కర్ విగ్రహం ఎక్కడైతే కూల్చివేతకు గురైందో అదే స్థానంలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరినట్టు చెప్పారు. పోరాటాలను ఈ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహం కూల్చివేత వెనుక ఉన్న వారి పేర్లను బయటపెట్టి నిందితుల్ని జైలుకు పంపాలని కోరినట్టు ఎల్.రమణ తెలిపారు.