కూకట్పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..మద్యం సేవించి బస్సును నడిపిన తాత్కాలిక డ్రైవర్
హైదరాబాదు: హైదరాబాద్ కూకట్పల్లిలోని వై జంక్షన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ముందు వెళుతున్న బస్సును వెనక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొంది. అయితే ఢీకొన్న బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. బస్సులు ఢీకొనగానే భయంతో వాహనదారులు పరుగులు తీశారు. డ్రైవర్ను పట్టుకుని చితకబాదారు వాహనదారులు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదం సోమవారం చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఈ బస్సులను నడుపుతున్నది తాత్కాలిక డ్రైవర్లు కావడం విశేషం. ఇక ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడైతే ఆర్టీసీ బస్సులను తాత్కాలిక డ్రైవర్లు నడపడం ప్రారంభించారో పలు చోట్ల ప్రమాదానికి గురైన సంఘటనలు వెలుగు చూశాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక డ్రైవర్లు మద్యం సేవించి బస్సులను నడుపుతున్నట్లు సమాచారం. ప్రయాణికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శలు వస్తున్నాయి. సరైన శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులను నడిపించి ప్రయాణికుల ప్రాణాలను ప్రభుత్వం తోడేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కండక్టర్ ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చూడాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.