తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వరా.. ఢిల్లీ పెద్దల తీరుపై రాష్ట్ర నేతల్లో తీవ్ర చర్చ..!
హైదరాబాద్ : రాష్ట్రంలో 2023 నాటికి అధికారం మాదేనంటూ రాష్ట్ర బీజేపీ నేతలు హడావిడి చేశారు. లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకుని ఫుల్ జోష్తో కనిపించారు. తెలంగాణలో కారు జోరు తగ్గిందని.. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎన్నో మాటలన్నారు. ఇక కొందరు కమలనాథులైతే రెండేళ్ల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ సెలవిచ్చారు. అంతేకాదు సభ్యత్వ నమోదును కూడా సీరియస్గా తీసుకుని తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అదంతా నాణానికి ఒకవైపు ఐతే.. మరి రెండో పార్శ్వం విస్మయానికి గురిచేస్తోంది. కశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో లోక్సభ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు తెలంగాణ బీజేపీ నేతలను ఇరుకున పడేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదలావుంటే రానున్న రోజులు మావేనంటూ ఆశలపల్లకిలో ఊరేగుతున్న రాష్ట్ర బీజేపీ నేతలను ఢిల్లీ పెద్దల తీరు పరేషాన్ చేస్తోందనే టాక్ నడుస్తోంది.
ఐదు స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోయి..!
తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడు గురించి వేరే చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ పార్టీగా అవతరించి ఇక్కడి ప్రజల నాడీని పసిగడుతూ ఇతర పార్టీలకు స్థానం లేకుండా చేస్తోంది. అసెంబ్లీలో సైతం ప్రతిపక్షం మాట వినపడకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని కారెక్కించారు. అదంతా అలా ఉంటే ఢిల్లీ నుంచి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు సైతం సీఎం కేసీఆర్ను ఆకాశానికెత్తి సూపర్ హీరోను చేశారు. ఆ క్రమంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పొచ్చు. అప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. ముందస్తు ఎన్నికల నాటికి బలహీనపడి కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకోవడం గమనార్హం.
పెద్ద సారును మరిచారా చిన్న సారూ.. తెలంగాణ సిద్దాంతకర్త జయంతి వేళ..!
2023 ఏమో గానీ.. ఇప్పటి పరిస్థితేంటో..!
అదలావుంటే లోక్సభ ఎన్నికల్లో కమలం పువ్వు సత్తా చాటడంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో హుషారొచ్చింది. దాంతో 2023 నాటికి రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడుతుందని ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక కొందరు సీనియర్ నేతలైతే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిస్థితులు తారుమారు అవుతాయని కూడా ప్రకటించారు. కానీ తాజా పరిణామాలు చూస్తే స్టేట్లో బీజేపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుందనే పరిస్థితి కనిపిస్తోంది.
అమిత్ షా వ్యాఖ్యలతో తలనొప్పేనా?
కశ్మీర్ విభజన బిల్లు ఆర్టికల్ 370 రద్దుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నేతలకు తలనొప్పిగా మారాయని అంటున్నారు కొందరు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో తెలంగాణ విభజన ప్రక్రియపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త తంటాలు తెచ్చిందనే వాదనలు లేకపోలేదు. అప్పట్లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు పాస్ చేయలేదా అంటూ అమిత్ షా మాట్లాడిన తీరు రాష్ట్ర బీజేపీ నేతలకు తిప్పలు తెచ్చిపెట్టనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమిత్ షా మతలబు క్యా హై..!
60 సంవత్సరాల పోరాటం.. నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల ఆకాంక్ష.. వందలకొలది ప్రాణ త్యాగాలు.. అలా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంతా ఈజీగా జరగలేదు. తెలంగాణ బిడ్డల న్యాయమైన పోరాటానికి అప్పటి కాంగ్రెస్ పెద్దలు దిగొచ్చి మరీ విభజన ప్రక్రియ పూర్తిచేశారు. అలాంటి క్లిష్ట, కష్టతరమైన రాష్ట్ర విభజన ప్రక్రియ గురించి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడదామనుకున్న అమిత్ షా వ్యూహం బెడిసికొట్టినట్లైంది. మరి ఈనాడు కశ్మీర్ విభజన బిల్లును హడావిడిగా సభలో పెట్టి ఆమోదించడం వెనుక మతలబేంటో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. 4 నెలల నుంచి అన్నీ కష్టాలే.. అందుకేనా రాజీనామాలు..!
రాష్ట్ర బీజేపీ నేతలకు కష్టకాలమేనా?
అదలావుంటే లోక్సభలో కశ్మీర్ బిల్లు ప్రక్రియ పూర్తయ్యాక.. తెలంగాణ బీజేపీ నేతలు ఎవరూ కూడా నోరు మెదపొద్దని ఢిల్లీ పెద్దలు ఆర్డరేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరూ కూడా మీడియా ముందుకు రావడం లేదు.. దాని గురించి ఏమి మాట్లాడటం లేదు. అంతేకాదు బీజేపీ నేతలు ఎవరూ రాక రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా మూగబోయినట్లు సమాచారం.
మొత్తానికి కారు జోరుకు బ్రేకులు వేసి తెలంగాణలో పుంజుకుందామని భావించిన రాష్ట్ర నేతలకు ఇప్పుడు అమిత్ షా రూపంలో కొత్త చిక్కొచ్చి పడింది. లోక్సభలో ఆయన చేసిన కామెంట్స్కు తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నలకు ఎలా జవాబు ఇవ్వాలనే దానిపై తికమక పడుతున్నారట స్టేట్ కమలనాథులు. అయితే అమిత్ షా మాట్లాడిన తీరు తెలంగాణ బీజేపీకి కాసింత మైనస్ అనే రీతిలో ప్రచారం జరుగుతోంది.