మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో -ఉసూరుమన్న అభిమానులు -ఆ తప్పు జరగొద్దనే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆదివారం నగరం దాదాపుగా కాషాయమయం అయింది. స్థానిక ఎన్నికలకు బీజేపీ జాతీయ నేతల రాకతో సాధారణ ఎన్నికల స్థాయి ప్రచారం జరుగుతుంగా, ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రంగంలోకి దిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అయితే..
Recommended Video
గ్రేటర్లో అమిత్ షా: వ్యూహం తెలుసా? -ఒకేదెబ్బకు 3సెగ్మెంట్లు - పాతబస్తీలో పూజలు -లష్కర్లో రోడ్ షో
మధ్యలోనే ముగిసిన షో..
గ్రేటర్ ప్రచారంలో భాగంగా రెండు కిలోమీటర్ల మేర సాగుతోందనుకున్న అమిత్ షా రోడ్ షో అనూహ్యంగా మధ్యలోనే ముగిసింది. ముందుగా ప్రకటించిన విధంగా అమిత్ షా.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెంగ్మెంట్ పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు రోడ్ షో చేయాల్సి ఉంది. అయితే షా కోసం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం, అంతకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు రోడ్లపైకి రావడంతో ప్రచార రధం నెమ్మదిగా కదిలింది. వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకు సాగాల్సిన రోడ్షో.. మధ్యలో నామాలగుండు వద్దే ఆగిపోయింది...
కార్యకర్తలు వినకపోవడంతో..
అమిత్ షా రోడ్ షో సందర్భంగా డజనుకుపైగా వాయిద్య కళాకారుల బృందాలను బీజేపీ రప్పించడంతో ఉదయం నుంచే వారసిగూడలో సందడి నెలకొంది. అమిత్ షా ఎంటరయ్యే సమయానికి కార్యకర్తల జోష్ తారాస్థాయికి చేరింది. బీజేపీకి తోడు జనసేన శ్రేణులు సైతం రంగంలోకి దిగారు. ప్రచార వాహనానికి ముందు కిలోమీటరు మేర కార్యకర్తలే కనిపించారు. వేగంగా ముందుకు కదలాలని నేతలు పదే పదే కోరినా కార్యకర్తలు వినిపించుకోలేదు. దీంతో అమిత్ షా ప్రచార వాహనాన్ని దిగి కారులో నాంపల్లికి వెళ్లిపోయారు అమిత్ షా. రోడ్ షోలో అమిత్ షా ప్రసంగం కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా,
ట్రంప్ ఒక్కడే బాకీ -మోదీ వారసుడి ఎన్నిక -గ్రేటర్లో అమిత్ షా ప్రచారంపై ఓవైసీ విమర్శలు
అందుకే అమిత్ షా వెళ్లిపోయారు..
అమిత్ షా తన రోడ్ షోను మధ్యలోనే ముగించడానికి వాహనం కదలకపోవడంతోపాటు మరో కారణం కూడా ఉంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఆ సమయంలోగా బయటి ప్రాంతాల నాయకులు(స్టార్ క్యాంపెయిన్లు) నగరం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. షా గనుక రోడ్ షో కొనసాగించి ఉంటే, నాంపల్లిలో ప్రెస్ మీట్ కుదరదు. సాయంత్రం 6 తర్వాత కూడా సిటీలో ఉంటే విపక్షాలు, ఎన్నికల సంఘం తప్పుపట్టే అవకాశాలు లేకపోలేవు. ఆ పొరపాటుకు తావు ఇవ్వరాదనే అమిత్ షా తన షోను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది.